విజయసాయిరెడ్డికి సిట్ పిలుపు ! 18న విజయవాడ సీపీ ఆఫీసులో ..!
ఏపీలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో షాక్ తగిలింది. రాజకీయాల్ని, పదవుల్ని వదిలేసి వ్యవసాయం చేసుకుంటున్న ఆయన.. తాజాగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఓ కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో చేసిన వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకుని ఇవాళ పోలీసులు నోటీసులు పంపారు. విజయవాడ సీపీ కార్యాలయంలో ఈ నెల 18న విచారణకు రావాలని ఆయనకు పంపిన సమన్లలో పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగినట్లు కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ హయాంలో ఐటీ సలహదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి కీలక పాత్రధారిగా గుర్తించారు. ఇప్పటికే ఆయన్ను విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపినా రాకపోవడంతో నిన్న హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో, వ్యాపార సంస్థల్లో తనిఖీలు కూడా చేసింది.

గతంలో మరో కేసు విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీలో జరిగిన మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డేనని, ఆయన గురించి భవిష్యత్తులో అడిగితే మరిన్ని వివరాలు అందిస్తానని ప్రకటించారు. దీంతో సిట్ ఇవాళ ఆయనకు నోటీసులు పంపింది. ఈనెల 18న విజయవాడ సీపీ ఆఫీసులో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. దీంతో విజయసాయిరెడ్డి విచారణకు హాజరై చెప్పే విషయాలు ఇప్పుడు మద్యం కుంభకోణం విచారణలో కీలకంగా మారబోతున్నాయి.












Click it and Unblock the Notifications