ఏపీలో సెప్టెంబర్ 7న మద్యం షాపుల బంద్-కారణమిదే..!
ఏపీలో మద్యం షాపులు సెప్టెంబర్ 7న మూత పడబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న ఎక్సైజ్ పాలసీ ద్వారా తమకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనతో ఉన్న మద్యం షాపుల ఉద్యోగులు ఇలా ఒక్క రోజు షాపులు మూసేసి నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ బేవరేజెస్ ఉద్యోగుల సంఘం నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన తమను అన్యాయంగా తొలగించవద్దని వీరు కోరుతున్నారు.
ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు మంగళం పాడాలనే నిర్ణయానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడంతో గత ఐదేళ్లుగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. గత ప్రభుత్వం పత్రికా ప్రకటన ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా తమను నియమించిందని, కానీ తమకి కనీస వేతనం కూడా సమయానికి అందించలేదని తమకి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఓటీలు కూడా ఏజెన్సీలు తినేశాయని వారు ఆరోపించారు.

2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయినా తమకు మంచి రోజు లు వచ్చాయని ఆశ పడ్డామని, కానీ ప్రభుత్వమే మద్యం దుకాణాలు ప్రైవేట్ పరం చేసి తమను రోడ్డున పడేయబోతున్నట్లు ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు తాము కూడా మద్దతు తెలియజేశామని, కానీ ఇప్పుడు నూతన ప్రభుత్వమే మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నా 18 వేల కుటుంబాలను రోడ్డున పడేసి అన్యాయం చేయొద్దని వేడుకుంటున్నారు.
ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ పరం చేస్తున్నారనే ప్రచారం పై కూటమి ప్రభుత్వం స్పష్తత ఇవ్వకపోతే ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 4 వ తేదీ నుండి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే నిరసన తీవ్రతరం చేసి 7న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు బంద్ చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications