సచివాలయాలకు త్వరలో కొత్త పేరు..! మంత్రి కీలక ప్రకటన..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సచివాలయాల వ్యవస్ధలో కీలక మార్పులు చేసేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగుల హేతుబద్ధీకరణ, సచివాలయాల జాబ్ ఛార్జ్ ల మార్పు వంటి నిర్ణయాలు ఇప్పటికే తీసుకుంది. ఇదే క్రమంలో ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను సైతం మార్చేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని ఇవాళ జరిగిన డేటా గవర్నెన్స్ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు.
అనంతరం రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై సచివాలయాలు, వాలంటీర్ల శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల వద్దకే పాలనను పరిచయం చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని ఆయన తెలిపారు. క్రెడిట్ చోరీ అని కొందరు అనడాన్ని ఆయన తప్పుబట్టారు. క్రెడిట్ చోరీలో జగన్ ని మించిన వారు లేరన్నారు. సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు లేకుండా, వ్యవస్థపై పర్యవేక్షణ లేకుండా సచివాలయ వ్యవస్థను జగన్ అస్తవ్యస్తంగా తయారు చేశారని మంత్రి స్వామి విమర్శించారు.

జగన్ సచివాలయ ఉద్యోగులకు కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కూడా ఇవ్వలేకపోయారన్నారు. సచివాలయ వ్యవస్థలో సీఎం చంద్రబాబు నాయుడు సమగ్ర మార్పులు తీసుకొస్తున్నారని, సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ కల్పించామని ఆయన గుర్తుచేశారు. సచివాలయ వ్యవస్థలో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో మూడు అంచల వ్యవస్థను తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల కోరిక మేరకే సచివాలయాల పేరు మార్చుతున్నామన్నారు. సచివాలయ వ్యవస్థకు ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పేరు పెట్టబోతున్నామన్నారు.












Click it and Unblock the Notifications