పడవ నడిపిన ఏపీ మంత్రి గౌతంరెడ్డి- పెన్నా నది వరద బాధితుల పరామర్శ..
తమిళనాడులో తీరం దాటిన నివర్ తుపాను ప్రభావం ఏపీపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా తమిళనాడుకు పొరుగునే ఉన్న నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. పెన్నా నది ఉగ్రరూపంతో పలు గ్రామాలు నీటమునిగాయి. ఈ ప్రాంతాల్లో జిల్లా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఇవాళ పర్యటించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
నెల్లూరు జిల్లాలో నివర్ తుపాను కారణంగా పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జిల్లాలోని సంగం మండలం వీర్లగుడిపాడు పూర్తిగా నీట మునిగి ఉంది. ఇక్కడ పెన్నా నది వరద బాధితులను పరామర్శించేందుకు జిల్లా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి బయలుదేరారు. అయితే ఈ గ్రామానికి చేరుకునేందుకు కార్లు కూడా వెళ్లలేని పరిస్ధితి ఉండటంతో మంత్రి గౌతంరెడ్డి స్వయంగా పడవ నడుపుతూ అధికారులతో కలిసి ఈ గ్రామంలో పర్యటించారు.
మంత్రి మేకపాటి వస్తున్నారన్న సమాచారంతో వీర్లగుడిపాడు గ్రామంలో జనమంతా గట్టున నిలబడి ఎదురుచూశారు. నిండా మునిగిన ఈ గ్రామాన్ని చూసి మంత్రి గౌతంరెడ్డి చలించిపోయారు. చిన్న వానకే మునిగిపోయే ఈ గ్రామాన్ని పెద్ద వరద ఇబ్బంది పెట్టిందని గ్రామస్ధులు గౌతంరెడ్డి దృష్టికి తెచ్చారు. వర్షాలు వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు రావచ్చుగా, ప్రమాదం జరిగితే ఎలా అని మంత్రి గౌతంరెడ్డి వారిని ప్రశ్నించగా.. తాతల కాలం నుంచి వానలు, వరదలు మాకు మామూలే సారూ అంటూ వారు బదులిచ్చారు.
దీంతో ఇకపై వరదలు వచ్చినా తట్టుకునేలా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇకపై ఎలాంటి సమస్య లేకుండా గ్రామస్తుల రాకపోకలకు అనువుగా బ్రిడ్జి కట్టిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎంతో శ్రమకోర్చి యేరులా మారిన ఊరికి పడవ నడుపుతూ తమ కోసం మంత్రి స్వయంగా రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.