మంత్రి జోగి రమేష్ కు తప్పిన ప్రమాదం - కాన్వాయ్ లో గుద్దుకున్న కార్లు-ప్రకాశంలో ఘటన
ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ ఇవాళ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ లోని రెండు కార్డు ఢీకొన్న ఘటనలో మంత్రి తృటిలో తప్పించుకున్నా రు.
ఏపీ మంత్రి జోగి రమేష్ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో ఆయన కాన్వాయ్ లో పలు కార్లు ఉన్నాయి. ఈ కార్లు జాతీయ రహదారిపై ఒకదానిని ఒకటి ఢీకొన్నట్లు తెలుస్తోంది. ముందుగా వెళ్తున్న ఓ కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న ఇతర కార్లు ఒక్కసారిగా ఢీకొన్నట్లు సమాచారం. దీంతో కాన్వాయ్ మధ్యలో ఉన్న మంత్రి జోగి రమేష్ కారు కూడా బ్రేక్ వేయబోయి డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న జోగి రమేష్ ఉలిక్కిపడ్డారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాన్వాయ్ ప్రమాదానికి గురి కావడంతో కాసేపు ఇబ్బందిపడ్డ మంత్రి జోగి రమేష్.. అనంతరం మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనపై పోలీసులు అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నారు. కాన్వాయ్ లో కార్లు ఢీకొనడానికి దారితీసిన కారణాలతో అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలోనూ పలువురు మంత్రుల కార్లు కాన్వాయ్ లో ఢీకొన్న ఘటనలు ఉన్నాయి. కారు డ్రైవర్ల అలసత్వంతో పాటు సుదీర్ఘ ప్రయాణాలు కూడా ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.