Jagananna Videsi Vidya:అర్హులందరికీ విదేశీ విద్య-సెప్టెంబర్ 30లోగా అప్లై చేసుకోమన్న మంత్రి
అమరావతి : ఏపీలో విద్యార్ధుల విదేశీ విద్య పథకంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. జగనన్న విదేశీ విద్య పథకం పేరుతో అమలుచేస్తున్న ఈ కార్యక్రమంలో అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరుస్తామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఇవాళ ప్రకటించారు.
జగనన్న విదేశీ విద్య పథకంలో అర్హత సాధించిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఈ పథకంలో ఏడాదికి ఇంత మందికే ఇవ్వాలన్న పరిమితి లేదని స్పష్టం చేశారు. ఈ పథకంలో భాగంగా లబ్ది పొందడానికి విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీ లోపుగా దరఖాస్తు చేసుకోవాలని నాగార్జున కోరారు.

జగనన్న విదేశీ విద్య పథకానికి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లతో పాటుగా అల్పాదాయం కలిగిన అగ్రవర్ణాలకు కూడా విదేశీ విద్య అందుబాటులోకి తీసుకువస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చారని మంత్రి మేరుగు గుర్తుచేశారు. ప్రస్తుతం జ్ఞానభూమి పోర్టల్ ద్వారా జగనన్న విదేశీ విద్య పథకంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన నియమ నిబంధనలు, జీవో లతో పాటుగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడానికి ఎంపిక చేసిన క్యూ.ఎస్. 1 నుంచి 200 దాకా ర్యాంకులు కలిగిన యూనివర్సిటీల జాబితాను కూడా ఆ వెబ్ సైట్ లోనే పెట్టామన్నారు.
ఈ యూనివర్సిటీలలో 1 నుంచి 100 లోపు క్యూఎస్ ర్యాంక్ కలిగిన యూనివర్సిటీల్లో సీటు సాధించిన వారికి కోటి రూపాయలైనా పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ చేస్తామని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. 101 నుంచి 200 లోపు ర్యాంక్ కలిగిన యూనివర్సిటీల్లో సీటు సాధించిన వారికి రూ.50 లక్షల వరకూ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ అందుతుందన్నారు. 8 లక్షల రుపాయలకు లోపు వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు అందరూ ఈ పథకంలో లబ్ది పొందడానికి అర్హులేనని గుర్తు చేసారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు జగనన్న విదేశీ విద్య కోసం తమ దరఖాస్తులను సమర్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఆయా కేటగిరీలకు చెందిన విద్యార్థుల దరఖాస్తులను రాష్ట్ర స్థాయి అధికారిక కమిటీలు పరిశీలించి వాటిలో అర్హులైన విద్యార్థుల జాబితాను సాంఘిక సంక్షేమశాఖకు సమర్పిస్తారని మంత్రి నాగార్జున తెలిపారు. సెప్టెంబర్ 30లోపు విద్యార్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. జగనన్నవిదేశీ విద్య పథకంలో ఎంత మంది అర్హత సాధిస్తే, అంత మందికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని, అందుకే ఈ పథకాన్ని అర్హత కలిగిన విద్యార్థులు అందరూ ఉపయోగించుకోవాలని నాగార్జున కోరారు. ప్రపంచ స్థాయిలో అత్యధిక ర్యాంకు కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు సాధించడానికి అవసరమైన టోఫెల్, జిఆర్ఇ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత శిక్షణ ఇచ్చే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని నాగార్జున వెల్లడించారు.












Click it and Unblock the Notifications