జాతీయ పండుగ కంటే జన్మదినానికే ప్రాధాన్యమా..!! మంత్రి వెల్లంపల్లి గైర్హాజరు వెనుక : ఏం జరిగిందంటే..!!
ఆగస్టు 15. దేశం మొత్తం చేసుకొనే జాతీయ పండుగ. ఇటువంటి రోజున ఇన్ ఛార్జ్ మంత్రి హోదాలో జెండా ఆవిష్కరించటం ఒక అరుదైన అవకాశం. ప్రతీ మంత్రి కోరుకొనే అంశం. అటువంటిది జాతీయ జెండా ఇన్ చార్జ్ మంత్రి హోదాలో ఆవిష్కరించి..సెల్యూట్ చేసే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా. అదే చేసారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఏపీ ప్రభుత్వం గతంలో నియమించిన ఇన్ ఛార్జ్ మంత్రులకు వారికి కేటాయించిన జిల్లాల్లో జాతీయ జెండా అధికారిక హోదాలో ఆవిష్కరించే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీకాకుళం ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఆజిల్లాలో జెండా ఆవిష్క రణకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, మంత్రి శ్రీకాకుళం లో జెండా ఆవిష్కరణకు హాజరు కాలేదు. ఎందుకంటే దానికి రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి ఇదే రోజున మంత్రి జన్మదినం కావటంతో అభిమానులకు అందుబాటులో ఉండాలని. రెండోది ముఖ్యమంత్రి విజయవాడలో జెండా ఆవిష్కరిస్తున్నారు. ఆ సమయంలో తాను ముఖ్యమంత్రితో పాటే ఉండాలని. ఇప్పుడు ఈ రెండు కారణాలు తెలుసుకొని..మంత్రి వెల్లంపల్లి తీరు పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

జెండా పండుగ కంటే..జన్మదినానికే ప్రాధాన్యమా..
మంత్రిగా ఒక జిల్లాలో ఇన్ఛార్జ్ హోదాలో జెండా ఎగురవేసే అవకాశం ఏ మంత్రీ వదులుకోరు. తమకు జెండా ఆవిష్కరించే అవకాశం ఇవ్వకపోవటం పైనా గతంలో అలిగిన మంత్రులు ఉన్నారు. అయితే, ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. గతంలో పీఆర్పీ నుండి 2009లో తొలి సారి వెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2019లో వైసీపీ నుండి గెలిచి మంత్రి అయ్యారు. జగన్ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. తొలి సారి మంత్రి అయినా ముఖ్యమంత్రి జగన్ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి శ్రీకాకళం జిల్లాకు ఇన్ ఛార్జ్ మంత్రిగా నియమించారు. దీనికి కొనసాగింపుగా స్వాతంత్ర దినోత్సవం నాడు ఇన్ ఛార్జ్ మంత్రి హోదాలో శ్రీకాకుళంలో వెల్లంపల్లికి జెండా ఆవిష్కరించే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అయితే, వెల్లంపల్లి మాత్రం ఆ అవకాశం సద్వినియోగం చేసుకోలేదు. అందుకు ఆయన సన్నిహతులు ఇతక కారణాలను తెర మీదకు తెచ్చారు. మంత్రి జన్మదినం కావటంతోనే ఆయన సొంత జిల్లాను కాదని...శ్రీకాకుళం వెళ్లలేదనే భావన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో నెలకొని ఉంది. దీంతో..ఇన్ ఛార్జ్ మంత్రి కాదని..జిల్లా మంత్రి ధర్మాన క్రిష్టదాస్ శ్రీకాకుళం జిల్లాలో జెండా ఆవిష్కరణ కు రంగం సిద్దమైంది.

వెల్లంపల్లి అందుకేనా గైర్హాజరైంది..
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిజంగా తన జన్మదినం కారణంగానే శ్రీకాకుళం జిల్లాలో స్వతంత్రి దినోత్సవ వేడకల్లో పాల్గొన లేదా అనే చర్చ ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే మంత్రి సొంత జిల్లాలో పత్రికల్లో వెల్లంపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటనలు కూడా వచ్చాయి. జన్మదినం నాడు తన అనుచరులు..సన్నిహితులకు అందుబాటులో ఉండేందుకే వెల్లంపల్లి తన పర్యటన రద్దు చేసుకున్నారని సన్నిహితులు చెబుతున్నా..మంత్రి కార్యాలయం నుండి అధికారికంగా వివరణ రాలేదు. ఇక, ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ సైతం విజయవాడలో జెండా ఆవిష్కరణ చేస్తున్నారు. ముఖ్యమంత్రి విజయవాడ వస్తున్న సమయంలో ఆయనతో ఉండాలనే కోరికతోనే వెల్లంపల్లి శ్రీకాకుళం లో జెండా ఆవిష్కరణకు దూరంగా ఉన్నారనే వాదన సైతం తెర మీదకు వచ్చింది. వెల్లంపల్లి తాను శ్రీకాకుళం జిల్లాలో జెండా ఆవిష్కరణకు హాజరు కావటం లేదనే సమాచారం ఇవ్వటంతో అక్కడ జిల్లా మంత్రి ధర్మాన క్రిష్టదాస్ కు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వెల్లంపల్లి తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం ద్వారా సహచర మంత్రులు సైతం దీని పైన చర్చించుకోవటం మొదలైంది.

అక్కడి రాజకీయాలే కారణమా..
ఇదే సమయంలో మరో ఆసక్తి కర చర్చ సైతం మొదలైంది. శ్రీకాకుళం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్నా..వెల్లంపల్లి కంటే ధర్మాన క్రిష్టదాస్ సీనియర్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి స్వాతంత్ర వేడుకలు కావటంతో..తనకు అవకాశం ఇవ్వాలంటూ ధర్మాన క్రిష్టదాస్ కోరటంతోనే వెల్లంపల్లి తన నిర్ణయం మార్చుకున్నారంటూ మరో చర్చ తెర మీదకు వచ్చింది. విజయవాడలో ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న అయిదు జిల్లాలు మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో ఇన్ ఛార్జ్ మంత్రులే జెండా ఆవిష్కరణకు హాజరవుతున్నారు. ఇటువంటి వ్యవహారంలో మంత్రిగా వెల్లంపల్లి
ఎటువంటి వివరణ ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications