''నిన్నటిదాకా సింగపూర్ షూటింగ్లో పవన్.. ఇప్పుడు మంగళగిరి షూటింగ్లో..'
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాజధానిని అమరావతి నుండి తలిస్తున్నట్టు ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని అన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అన్యాయం చేయదన్నారు. గత టీడీపీ హయాంలో ఐదేళ్లు రైతులకు అన్యాయం జరిగినా పట్టించుకోని పవన్ కల్యాణ్.. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేయడం సరికాదన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన 'ప్రధాన మంత్రి అవాస్ యోజన-వైఎస్సార్ అర్బన్ హౌసింగ్ పథకం' కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
మంగళగిరిలో పవన్ పర్యటనపై మంత్రి సెటైర్స్.. :
పవన్ కల్యాణ్ నిన్నటిదాకా సింగపూర్లో సినిమా షూటింగ్లో ఉన్నాడని మంత్రి వెల్లంపల్లి అన్నారు. అక్కడ షూటింగ్ అయిపోయాగానే మంగళగిరికి వచ్చి షూటింగ్ మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు కలల రాజధాని అంటూ హడావుడి చేశారని విమర్శించారు. కానీ సీఎం జగన్ 13 జిల్లాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు.
చంద్రబాబు హయాంలో పథకాలన్నీ నీరుగార్చారు.. : మంత్రి వెల్లంపల్లి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-వైఎస్సార్ అర్బన్ హౌజింగ్ పథకం కింద లబ్దిదారులకు గృహ మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. 137 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందడంపై సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అనేక సంక్షేమ పథకాలను అటకెక్కించారని మండిపడ్డారు. 108,ఫీజురీయింబర్స్మెంట్ వంటి పథకాలను నీరుగార్చారని అన్నారు.
పేదల కోసమే జగన్..
ప్రభుత్వ సంక్షేమ-అభివృద్ది పథకాలన్నీ పేదలకు చేరాలన్నదే సీఎం జగన్ తాపత్రయం అన్నారు మంత్రి వెల్లంపల్లి. అందుకోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నారని చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా పేదలకు చేరువయ్యే పాలనను అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. భవిష్యత్లో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
టీడీపీ హయాంలో తీవ్ర అవకతవకలు..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల మంజూరు కోసం జరిగిన లబ్దిదారుల ఎంపికలో తీవ్ర అవకతవకలు జరిగాయని మంత్రి ఆరోపించారు. హడావుడిగా పేదల వద్ద డబ్బులు వసూలు చేసి.. చివరకు ఇళ్లు మంజూరు చేయలేదన్నారు. కానీ సీఎం జగన్ వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఉండవద్దన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణంపై ఆయన ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు చెప్పారు.