‘ఎక్కడ అవినీతి జరిగినా జగన్ పేరే! వైసీపీకి కాలం చెల్లినట్లే’
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్రమంత్రులు, టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుకు జగన్ సవాల్ విసరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సవాల్ కు తాము స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
Recommended Video
జగన్లా స్థాయి తగ్గించుకోలేం
జగన్ సవాల్ కు స్పందించి తమ స్థాయిని తగ్గించుకోలేమని యనమల స్పష్టం చేశారు. జగన్ అవినీతిపై పేపర్లలో రాయించాల్సిన అవసరం తమకు లేదని, ఆయన అవినీతిపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేయాలనే వైసీపీ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.
ఎక్కడ అవినీతి జరిగినా జగన్ పేరే..
ఎక్కడ అవినీతి జరిగినా జగన్ పేరే వినబడుతోందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. 2019లోపు జగన్ జైలుకెళ్లడం ఖాయమని, రాబోయే రోజుల్లో జగన్ పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదని అన్నారు. ప్రభుత్వాన్ని తప్పుబట్టే అవకాశం లేకనే, అసెంబ్లీ సమావేశాలను జగన్ బహిష్కరించారని వ్యాఖ్యానించారు.
నిందితుడిగా జగన్ ఎందుకున్నారు?
మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ తన సొంత మీడియా ద్వారా ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. సీబీఐ కేసుల్లో జగన్ ఎందుకు నిందితుడిగా ఉన్నాడో ప్రజలకు చెప్పాలని అన్నారు. దేశంలో జాతీయ ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతుంటే, కేవలం పోలవరం ప్రాజెక్టు పనులు మాత్రమే వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు.
జగన్కు బుర్రుందా?
మరో మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. జగన్కి బుర్ర లేదని, 45ఏళ్ల వయసున్న వారికి పెన్షన్ ఇస్తానంటున్నారని విమర్శించారు. అసలు, జగన్కి పెన్షన్ అంటే ఏంటో తెలుసా? అది ఎవరికిస్తారో తెలుసా? అంటూ ఎద్దేవా చేశారు.