పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముసుగు తొలగింది: దిగజారుడు, చెప్పుతో కొడతారంటూ ఏపీ మంత్రుల ఫైర్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆసక్తి చూపుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎంతమంది పొత్తులు పెట్టుకుని వచ్చినా వైసీపీ ఒంటరిగానే ఎదుర్కొంటుందని చెబుతున్నారు.
చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ ఆరాటం: అంబటి
ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఎన్నికలంటే చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. జనసేన పార్టీ పెట్టింది చంద్రబాబును సీఎం చేయడానికా అని ప్రశ్నించారు. జనసేన కార్యకర్తలు ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబును సీఎం చేయడానికి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలంటే భయపడాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. గడిచిన మూడేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు.
చెప్పులతో కొడతారంటూ చంద్రబాబుపై అంబటి ఫైర్
ఎన్నికలకు భయపడే పొత్తు పెట్టుకోండంటూ చంద్రబాబు అందరి కాళ్లవేళ్ల పడుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన జడ్ ప్లస్ సెక్యూరిటీ తీసేసి బయటికి వస్తే గతంలో హామీలు ఇచ్చి మోసం చేసినందుకు చంద్రబాబును మహిళలు చెప్పుతో కొడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే నమ్మకంతోనే ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. 95 శాతం హామీలు అమలు చేశామన్నారు.
చంద్రబాబు, పవన్ మధ్య ముసుగు తొలగిపోయిందన్న మంత్రి కారుమూరి
మరో మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. చంద్రబాబు, పవన్ మధ్య ముసుగు తొలగిపోయింది. తన టెంట్ హౌస్ పార్టీని మరోసారి అద్దెకు ఇచ్చేందుకు పవన్ సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ అభిమానులు తనను సీఎం చేసుకోవాలని చొక్కాలు చించుకుంటుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబును సీఎం చేయడానికి చొక్కాలు చించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడని, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు అవమానించినప్పుడు.. ఇదే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.
పవన్, చంద్రబాబు ఇప్పుడు కలవడమేంటన్న జోగి రమేష్
గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ పొత్తు వలన తమకొచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారి అని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పంచన ఉంటూ చంద్రబాబుకు సిగ్నల్ ఇచ్చేవాడిని ఇంకేం అంటారు? అని ప్రశ్నించారు. పవన్ అన్నట్టుగానే రాష్ట్రంలో అద్భుతం జరగబోతోంది. ఆ అద్భుతం వైఎస్సార్సీపీ 151పైగా సీట్లలో గెలవటమే. అంతే తప్ప పవన్ ఊహించుకునేదేమీ జరగదని అన్నారు. అంతేగాక, చంద్రబాబు, పవన్ ఇవాళ కలిసేదేముందీ?. మొదటనుంచి వారి మధ్య అక్రమ పొత్తులు కొనసాగుతున్నాయి. వారి పొత్తుల వలన తమకు వచ్చే ఇబ్బందిఏమీ ఉండదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎవరి వలన అందుతున్నాయో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.
అభద్రతా భావంలో చంద్రబాబు అంటూ బాలినేని
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పవన్, చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.తెలుగుదేశం పార్టీపై నమ్మకం కోల్పోయి వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో అన్న అభద్రతా భావంలో చంద్రబాబు ఉన్నాడని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ఎంతటికైనా దిగజారతాడని బాలినేని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సింగిల్గా ఎదుర్కోలేకే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. హోంమంత్రి వనితపై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను బాలినేని ఖండించారు. తన తోబుట్టువుతో సమానమైన హోంమంత్రి వనితను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.