రాజధానికి 27 వేల ఎకరాల సేకరణ: నారాయణ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకూ 27 వేల ఎకరాల భూమిని సమీకరించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఇంకా ఆరువేల ఎకరాలు సమీకరించాల్సి ఉందని, శనివారం రాత్రి వరకూ భూసమీకరణ చేస్తామని తెలిపారు. శనివారం మంగళగిరి, నిడమర్రు, బేతపూడి గ్రామాల్లో పర్యటించిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
ఆదివారం నుంచి భూ సేకరణ చేపడతామని ప్రకటించారు. తుళ్లూరు కేంద్రంగా ఆదివారం నుంచి సీఆర్డీఏ కార్యకలాపాలు కొనసాగుతాయని మంత్రి తెలిపారు. రాజధాని ప్రాంతంలో 30 కోళ్ల ఫారాలు గుర్తించామని, వారికి పరిహారం విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.

కాగా, ఏపీ నూతన రాజధాని భూసమీకరణ గడువు నేటితో ముగియనుంది. చివరి రోజు రైతుల నుంచి సమ్మతి పత్రాలు స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి వరకైనా రైతుల నుంచి సమ్మతి పత్రాలు తీసుకునేలా చర్యలు చేపట్టారు. భూ సమీకరణ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గ్రామాల్లో సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
కాగా, బేతంపూడి గ్రామ ప్రజలు భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఎలాగైనా భూసేకరణ జరిపి తీరాలనే పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది.












Click it and Unblock the Notifications