ఎపి అసెంబ్లీలో పాతజ్ఞాపకాలు, ఉద్వేగం: తేరిపారా జగన్
హైదరాబాద్: విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైన సమయంలో ఎమ్మెల్యేలు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పాత అసెంబ్లీ కావడం, ఎసి సదుపాయం లేకపోవడం, ఫ్యాన్లు సరిగా లేకపోవడం, సరైన వౌలిక సదుపాయాలు లోపించడం తదితర పరిస్ధితుల మధ్య సీదాసాదాగా అసెంబ్లీ సమావేశం తొలి రోజు గడిచింది. సభలో మూడు పార్టీలే కొలువు తీరాయి. అధికార పక్షంలో టిడిపి, బిజెపి పార్టీలు, ప్రతిపక్ష స్ధానంలో వైకాపా పార్టీ సభ్యులు కూర్చున్నారు.
1952 తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే ప్రథమం. ప్రతిపక్ష నేత జగన్ ముందుగా అసెంబ్లీలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీ అంతా తేరిపారా చూశారు. సహచర ఎమ్మెల్యేలలతో నవ్వుతూ కనిపించారు. ప్రతిపక్ష స్ధానంలో అసీనులైన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు అంతా వచ్చి కరచాలనం చేశారు. సభ జరిగినంత సేపు జగన్ పక్కన డిప్యూటీ నేత జ్యోతుల నెహ్రూ జగన్ పక్కనే కూర్చున్నారు.
భోజన విరామ సమయం, తేనీటి విరామ సమయంలో మాత్రం చాలా మంది ఎమ్మెల్యేలు తమ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. సీనియర్ టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విలేఖర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. వీలైనంత తొందరగా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మన ప్రాంతానికి వెళ్లిపోవాలని, మన ప్రాంతంలో మనం సమావేశం నిర్వహించుకుంటే బాగుంటుందని, మహా అంటే మరో రెండేళ్లు ఇక్కడ ఉంటామేమో అని భావోద్వేగంతో అన్నారు.
1983లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాయన్నానని, అప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే సభలో తొలిసారిగా ప్రవేశించారన్నారని, పాత అసెంబ్లీకి ఘనమైన చరిత్ర ఉందన్నారు. మన రాష్ట్రంలో మనం అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటే బాగుంటుందన్నారు. ఆ మంచి తరుణం కోసం ఎమ్మెల్యేలు అందరూ ఎదురుచూస్తున్నారన్నారు.
మోదుగుల వేణుగోపాల రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమం నాటి జ్ఞాపకాలు ప్రస్తావించారు. అనంతరం జరిగిందేదో జరిగిపోయింది, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఎంపీగా తాను రాష్ట్ర సమైక్యతకు చేసిన కృషిని పాత్రికేయులు అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు.