వందల కోట్లు వెనకేశాడు: రఘుకు క్లీన్చిట్ ఇచ్చారు
అమరావతి: వందల కోట్లు ఆస్తులు సంపాదించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ టౌన్ , ప్లానింగ్ మాజీ డైరెక్టర్ రఘు సఛ్చీలుడని పురపాలక శాఖ ప్రకటించింది.ఎసీబీ అధికారుల దాడులకు ముందే పురపాలక శాఖ రఘుకు క్లీన్చిట్ ఇచ్చింది.
జిహెచ్ఎంసిలో రఘు లీలలు: అతనుంటే చాలు...
ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖలో టౌన్ ప్లానింగ్ శాఖ మాజీ డైరెక్టర్ రఘుపై గత మాసంలో అవినీతి శాఖాధికారులు దాడి చేశారు. ఏసీబీ అధికారుల దాడులతో రఘు అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి.
అయితే తాను అక్రమంగా సంపాదించిన ఆస్తులను డొల్ల కంపెనీలను సృష్టించినట్టుగా అవినీతి నిరోధక శాఖాధికారులు గుర్తించారు.రఘుకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయనే విషయమై అవినీతి నిరోదకశాఖాధికారులు ఆరా తీస్తున్నారు.
రఘుకు సహకరించిన వ్యక్తులు ఎవరెవరున్నారనే విషయాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.అయితే ఉద్యోగ విరమణకు పది రోజుల ముందు రఘుపై ఏసీబీ అధికారులు దాడి చేశారు.
రఘు చాలా మంచోడు
అవినీతి నిరోధక శాఖాధికారులకు చిక్కిన రఘు చాలా మంచోడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ క్లీన్ చిట్ వ్యవహారం ఇప్పుడు బయటికొచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ పురపాలక శాఖ డైరెక్టర్ రఘుకు పలు ఆస్తులున్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. అవినీతి నిరోధక శాఖాధికారుల దాడికి నాలుగు రోజుల ముందే రఘు సచ్ఛీలుడంటూ పురపాలక శాఖ క్లీన్చిట్ ఇచ్చేసింది. పది రోజుల్లో రఘు ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఉద్యోగ విరమణను పురస్కరించుకొని అన్ని సమస్యలు క్లియర్ చేసుకొన్నారు రఘు. ఈ కారణంగానే రఘుకు పురపాలక శాఖ క్లీన్చిట్ ఇచ్చేసింది. అయితే రఘుకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు సహకరించిందేవరనే విషయమై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.
Recommended Video
ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ కోసం జాగ్రత్తలు
వాస్తవానికి రఘు ఈ ఏడాది సెప్టెంబరు 30 వ, తేదిన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయితే అన్ని సమస్యలు క్లియర్ చేసుకోవాలనుకున్న అవినీతి డైనోసార్కు ఎవరు సహకరించారో తెలియదు గానీ.. ఆయన అక్రమాలపై విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక చెత్తబుట్టలో పడింది. విచారణ పెండింగ్లో ఉంటే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందవు. దీంతో రఘురామిరెడ్డి తాను వందల కోట్లకు పడగలెత్తిన మార్గాన్నే అనుసరించి సచ్ఛీలుడిగా బయటపడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిటైర్మెంట్కు పది రోజులు ఉందనగా సెప్టెంబరు 21న, రఘుకు క్లీన్చిట్ను మున్సిఫల్ శాఖ ఇచ్చింది.
రఘుపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
చిత్తూరు జిల్లాకు చెందిన రఘు 2007లో విశాఖపట్నం నగరపాలక సంస్థలో సిటీ ప్లానర్గా పనిచేశాడు.. అప్పట్లో విశాఖలో ఎక్కడ భవనం నిర్మించుకున్నా తనకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే అడ్డగోలు నిర్మాణాలకు అనుమతులిచ్చేవారని ఆరోపణలున్నాయి. రఘు మరీ విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ రాష్ట్రంలోనే పెద్దదైన విశాఖ నగరంలో నిర్మాణాలకు ప్రణాళిక లేకుండా చేస్తున్నారని పెద్దఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. దీంతో ప్రభుత్వం 2008లోనే విజిలెన్స్తో విచారణ చేయించింది. రఘుతో పాటు ఆయనకు అన్ని విధాలా సహకరించిన ఐదుగురు రెవెన్యూ అధికారుల పాత్రపైనా విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. వీరందరిపై చర్యకు సిఫారసు చేసింది. అయితే తాము నిమిత్తమాత్రులమని, ఇందులో తుది నిర్ణయం రఘుదే గనుక తమపై చర్య తీసుకోవద్దని మిగతా ఐదుగురు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఎట్టకేలకు 2013లో రఘుపై క్రమశిక్షణ చర్యల కోసం విచారణకు ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం.
అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించిన రఘు
విశాఖలో అక్రమ నిర్మాణాలకు తానిచ్చిన అనుమతుల్లో తనను మాత్రమేప్రభుత్వం బాధ్యుడిని చేయడం సమంజసం కాదని రఘు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(ఏపీఏటీ)లో పిటిషన్ వేశారు. తనపై చర్యలను నిలిపివేయాలని కోరారు. ఏపీఏటీ ఆయనకు అనుకూలంగా 2014లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వెంటనే హైకోర్టును ఆశ్రయించే అవకాశం ప్రభుత్వానికి ఉంది. కానీ, ప్రభుత్వం మాత్రం రఘుపై హైకోర్టును ఆశ్రయించలేదు. అయితే ఈ విషయమై రఘు ఉన్నతాధికారును మేనేజ్ చేసి ఉంటారనే ఆరోపణలు కూడ వ్యక్తమౌతున్నాయి.
విజయవాడలో మరిన్ని ఆస్తులు
ఏసీబీ అధికారులు రఘును మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకొన్నారు. పోలీసుల విచారణలో రఘు పలు కీలకమైన ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్టు సమాచారం. విజయవాడలో మరిన్ని ఆస్తులు రఘుకు ఉన్నాయని విచారణలో ఏసీబీ అధికారులు గుర్తించారని సమాచారం.తన అక్రమ సంపాదన, ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి.. సహకరించిన వ్యక్తులు, ఇతర వ్యాపారాలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారని సమాచారం. రఘు ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది.