ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్-70 శాతానికి పైగా ఓటింగ్
ఏపీలో ఇవాళ జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ముగిసింది. 12 కార్పోరేషన్లతో పాటు 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో పలు చోట్ల భారీ పోలింగ్ శాతాలు నమోదయ్యాయి. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న వారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.
ఏపీలో హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లతో పాటు 75 మున్సిపాలిటీలకు ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇందులో నాలుగు మున్సిపాలిటీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. వీటిలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి.
ఉదయం పలు చోట్ల మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానానికి ఊపందుకుంది. అయితే ఎస్ఈఈసీ దృష్టి పెట్టిన విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి కార్పోరేషన్లలో పోలింగ్ శాతాలు ఓ మోస్తరుగా మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో పలు చోట్ల చెదురు మదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్ధులు, కార్యకర్తలు దాడులకు దిగడం, పోలింగ్ బూత్లో ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే ఎస్ఈసీ, పోలీసులు జోక్యం చేసుకుని ఘర్ణణలు నివారించడంతో పోలింగ్ దాదాపు ప్రశాంతంగానే సాగిపోయింది.