సినీ టికెట్లపై విపక్షాల్ని ఇరికించేసిన జగన్- నోరెత్తేందుకు జంకు-టాలీవుడ్ పరిస్దితీ అదే
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. సినిమా టికెట్ల ధరల్ని తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో థియేటర్లు మూతపడుతున్నాయి. డిస్టిబ్యూటర్లు భగ్గుమంటున్నారు. అంతిమంగా ప్రేక్షకుడికి సినిమా దూరమవుతోంది. ప్రభుత్వ ఉద్దేశమైన చౌకధరకే సినిమా చూపించడం అనేది నెరవేరడం లేదు. అయినా ఏపీలో విపక్షాలు, టాలీవుడ్ పెద్దలు దీనిపై నోరు మెదపడం లేదు. దీనికి ప్రధాన కారణం టికెట్లు ధరలు తగ్గడం మీకు ఇష్టంలేదా అంటూ వైసీపీ చేస్తున్న ఎదురుదాడే.
సినీ టికెట్ల ధరల రచ్చ
ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారం కలకలం రేపుతోంది. గతంలో సినిమా టికెట్ల ధరల్ని పెంచుకునేందుకు మాత్రం ప్రభుత్వాలు అప్పుడప్పుడూ అనుమతి ఇచ్చేవి. కానీ ఈసారి వైసీపీ ప్రభుత్వం మాత్రం సినిమా ధరల్ని తగ్గించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ తో పాటు దాన్ని నమ్ముకున్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్ల యాజమాన్యాలకు అస్సలు మింగుడుపడటం లేదు. అయితే కొందరు టాలీవుడ్ హీరోలు మాత్రం దీనిపై స్పందిస్తున్నారు. దీనికి వైసీపీ మంత్రులు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చేస్తున్నారు.
విపక్షాలను ఇరికించేసిన జగన్
ఏపీలో సినిమా టికెట్ల ధరల్ని తగ్గించాలన్న నిర్ణయం అంతిమంగా ప్రేక్షకులకు మేలు చేస్తుంది. అయితే ఆ ధరకు తట్టుకుని సినిమాలు తీసి విడుదల చేసే ధైర్యం నిర్మాతలకు ఉంటే అది సక్సెస్ అవుతుంది. అలా కాకుండా ఈ ధరలతో టికెట్లు అమ్మలేక ధియేటర్లే మూతపడే పరిస్ధితులు ఎదురైతే అప్పుడు ప్రభుత్వ నిర్ణయం బూమరాంగ్ కాక తప్పదు. కానీ ప్రేక్షకులకు తాత్కాలికంగా ధరల తగ్గింపు బూచి చూపి విపక్షాలను జగన్ ఇరుకునపెట్టేశారు. ఇప్పుడు దీనిపై మాట్లాడిన వారికి ధరలు తగ్గడం మీకు ఇష్టం లేదా అంటూ వైసీపీ మంత్రులు కౌంటర్లు వేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై నోరెత్తేందుకు విపక్షాలు జంకుతున్నాయి.
నోరెత్తలేని స్ధితిలో విపక్షాలు
ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మామూలుగా అయితే విపక్షాలు భగ్గుమనాలి. కానీ ప్రేక్షకుల కోణంలో చూస్తే ధరల తగ్గింపు నిర్ణయం వారికి ప్రయోజనం చేకూర్చేదే. అటువంటప్పుడు దీన్ని విమర్శిస్తే ప్రేక్షకులకు చౌకగా వినోదం లభించడం వీరికి ఇష్టం లేదన్న విమర్శలు వస్తాయి. కాబట్టి విపక్షాలు ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు సిద్ధం కావడం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో ధియేటర్లు మూతపడుతున్నా, ప్రేక్షకులకు వినోదం దూరమయ్యే పరిస్ధితి వస్తున్నా విపక్షాలు మాత్రం నోరెత్తడం లేదు. దీనిపై మాట్లాడితే వైసీపీ ఎదురుదాడి మొదలుపెట్టేస్తోంది. దీంతో కొంతకాలం వ్యూహాత్మక మౌనం పాటించడమే మంచిదన్న భావనలో వారు ఉన్నట్లు కనిపిస్తోంది.
అందుకే పవన్ సహా టాలీవుడ్ పెద్దల మౌనం?
సినిమా టికెట్ల ధరల తగ్గింపు నిర్ణయంపై గతంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మాత్రం దీనిపై నోరెత్తడం లేదు. దీనిపై మాట్లాడితే తన సినిమాలకు వచ్చే ప్రయోజనం కంటే రాజకీయంగా జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందన్న అంచనాకు రావడం వల్లే ఆయన మౌనంగా ఉండిపోతున్నట్లు అర్ధమవుతోంది. అదే సమయంలో టాలీవుడ్ పెద్దలు కూడా దీనిపై స్పందించేందుకు ఇష్టపడటం లేదు.
ఎందుకంటే ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంపై మాట్లాడితే మరిన్ని కఠిన నిర్ణయాలు రావొచ్చన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో ఈ వ్యవహారంపై థియేటర్ల యాజమాన్యాలతో కోర్టుల్లో కేసులు వేయించి న్యాయపోరాటం చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.