చంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు? -పార్టీ రహిత ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోనా? -వైసీపీ తీవ్ర అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు గురువారం మేనిఫెస్టో విడుదల చేశారు. కాగా, పార్టీ రహితంగా సాగే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడంపై అధికార వైసీపీ అభ్యంతరం తెలిపింది. దీన్ని నిబంధనల ఉల్లంఘనగా భావించి, బాబుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డను వైసీపీ డిమాండ్ చేసింది..

టీడీపీ పంచ సూత్రాలు..
పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో 'పల్లె ప్రగతి - పంచ సూత్రాలు' పేరిట చంద్రబాబు విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోలో.. 1)ఉచిత కుళాయిలతో రక్షిత మంచినీరు అందిస్తామని, 2)భద్రత-ప్రశాంతతకు భరోసా కల్పిస్తామని, 3)ఆలయాలపై దాడులు అరికట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తామని, 4)స్వయం సంవృద్ధి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లను అడ్డుకుంటామని, 5)ఆస్తి పన్ను తగ్గించి పౌర సేవలు అందిస్తూ స్వచ్ఛత పరిశుభ్రత పాటిస్తూ ఆదర్శ గ్రామలు తీర్చిదిద్దటమే లక్ష్యమని పేర్కొన్నారు. దీనిపై..

చంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు..
పల్లె ప్రగతి - పంచసూత్రాలు పేరుతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం సరికాదని ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ''పార్టీ రహితంగా సాగే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో ఎలా రిలీజ్ చేస్తుంది? అసలు ఎన్నికల ప్రణాళికను విడుదల చేసే అధికారం చంద్రబాబుకు ఎవరు కల్పించారు? ఇందుకుగానూ ఆయనపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎలాంటి చర్యలు తీసుకుంటారు?'' అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. అలాగే..

చంద్రబాబు స్ఫూర్తితో నిమ్మగడ్డ
పంచాయితీ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ.. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ''చంద్రబాబును స్పూర్తిగా తీసుకుని నిమ్మగడ్డ పనిచేస్తున్నట్లుంది. నిజానికి నిమ్మగడ్డ పనిచేయాల్సింది రాజ్యాంగ స్ఫూర్తితో. ప్రజాస్వామ్యంలో తమకు లేని అధికారాన్ని ప్రదర్శించే ఎవరైనా మూల్యం చెల్లించుకోక తప్పదు'' అని అంబటి ఫైరయ్యారు.

శుక్రవారం నుంచే పోరు షురూ..
ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం (జనవరి 29) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జనవరి 31 నామినేషన్ల దాఖలుకు తుది గడువు కాగా, ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన, ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం, ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు, ఫిబ్రవరి 9న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు), ఫిబ్రవరి 9న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగనుంది. తొలిదశలో 173 మండలాల్లోని పంచాయితీలకు ఎన్నికలు జరుగనున్నాయి.












Click it and Unblock the Notifications