చెన్నై వరదల్లో ఎపి వ్యక్తి మృతి: అక్కడ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై వరదల్లో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన నారాయణ చెన్నైలో నివాసం ఉండేవాడు. చెన్నైలో ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు.
చెన్నైలో గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల్లో నారాయణ మరణించినట్లు చెన్నై అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తమిళనాడు వరదల్లో ఇప్పటి వరకు 325 మంది మరణించారు.
చెన్నైలో వరద బాధితులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో సేవలను ప్రారంభించింది. ఇక్కడి నుంచి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేవారి కోసం నాలుగు రోజులపాటు ఉచిత బస్సులను నడుపుతారు. నగరంలో కూడా ఉచిత ప్రయాణం చేసేందుకు అనుమతించారు.
శనివారం ఉదయం వర్షం కొద్ది సేపు తెరిపివ్వటంతో చాలామంది సొంత ఊళ్లకు బయల్దేరారు. కాగా, ఈ నెల 8వ తేదీ వరకు 35 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శనివారం ఉదయం కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురియటంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.