కోర్టులకు కూడా వద్దు-నేరుగా.. ! బంగ్లాదేశీయులపై సువేందు సంచలన ఆదేశాలు..!
పశ్చిమ బెంగాల్లోకి బంగ్లాదేశ్ చొరబాటుదారుల సమస్యపై గత ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసి మరీ అధికారంలోకి వచ్చిన సీఎం సువేందు అధికారి (Suvendu Adhikari)ఇప్పుడు అదే సమస్యపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. బంగ్లాదేశ్ తో ఉన్న సరిహద్దుల్లో కంచె వేసేందుకు వీలుగా 600 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించిన సువేందు.. ఇప్పుడు బంగ్లాదేశ్ పౌరులు కనిపిస్తే చాలు తరిమికొట్టేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చారు.
బెంగాల్లో అదుపులోకి తీసుకున్న అక్రమ బంగ్లాదేశీ వలసదారులను ఇకపై కోర్టుల ముందు హాజరుపరచకుండా, దేశ బహిష్కరణ కోసం నేరుగా సరిహద్దు భద్రతా దళానికి (BSF) అప్పగించాలని సీఎం సువేందు అధికారి ఆదేశాలు ఇచ్చారు. తక్షణం అమల్లోకి వచ్చిన ఈ ఆదేశాన్ని రాష్ట్ర పోలీసులకు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు కూడా సమాచారం ఇచ్చారు. బెంగాల్ కొత్త బీజేపీ ప్రభుత్వ విధానం ప్రకారం.. అక్రమ వలసదారులుగా తేలి, పౌరసత్వ సవరణ చట్టం కింద పౌరసత్వం కోరేందుకు అర్హత లేని వారిని కోర్టు ముందు హాజరుపరచకుండా, నేరుగా బీఎస్ఎఫ్ సరిహద్దు అవుట్పోస్టులకు తీసుకువెళతారు.

బంగ్లాదేశీ చొరబాటుదారుల విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన విస్తృతమైన 'గుర్తించడం, తొలగించడం, దేశ బహిష్కరణ' (detect, delete and debut) చట్రంలో భాగంగానే ఈ చర్య ఉందని సువేందు అధికారి అభివర్ణించారు. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీయుల కేసులలో సాధారణంగా అనుసరించే విధానానికి ఇది ఒక విధంగా భిన్నమైనది. 2016లో అప్పటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటులో మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, భారతదేశంలో బంగ్లాదేశ్ నుండి సుమారు 2 కోట్ల అక్రమ వలసదారులు ఉన్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications