అమరావతి రైతులకు షాక్ - అర్ద్రరాత్రి ఉత్తర్వులు..!!
అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అమరావతి జేఏసీ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తవుతోంది. దీంతో.. గతంలో న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర నిర్వహించింది. ఇప్పుడు అమరావతి టు అరసవల్లి పాదయాత్రకు నిర్ణయించింది. దీని పైన అనుమతి కోరింది. అనుమతి నిరాకరిస్తూ దీనికి సంబంధించిన కారణాలను పోలీసు శాఖ వెల్లడించింది. అర్ద్రరాత్రి ఈ ఆదేశాల కాపీని అమరావతి జేఏసీ నేతలకు అందాయి.

పాదయాత్రకు అనుమతి ఇవ్వలేం
అంతకు ముందు హైకోర్టులో పాదయాత్రకు అనుమతి విషయం పైన వాదనలు జరిగాయి. డీజీపీ తగిన ఉత్తర్వులు ఇస్తారని హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది (జీపీ) మహేశ్వరరెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఆ వివరాలను నమోదు చేసిన న్యాయమూర్తి.. విచారణను ఈనెల 9కి వాయిదా వేశారు. డీజీపీ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు ముందుంచాలని స్పష్టం చేశారు. యాత్రకు అనుమతి ఇస్తే మంచిదని, లేని పక్షంలో ఆ ఉత్తర్వుల చట్టబద్ధతను పరిశీలిద్దామని వ్యాఖ్యానించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో..డీజీపీ రాత్రి తమ నిర్ణయాన్ని వెల్లడించారు.

కోనసీమ జిల్లా ఘటన ప్రస్తావిస్తూ
గతంలో తిరుపతి వరకు పాదయాత్ర సమయంలో ఇఛ్చిన హామీలను ఉల్లంఘించారని డీజీపీ తన నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ ప్రస్తావించారు. గత పాదయాత్రలో విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పై దాడులు చేసి గాయపర్చారని, వారిని ఉద్దేశ పూర్వకంగా అడ్డుకున్నారని పేర్కొన్నారు. దీని కారణంగా 71 క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు ప్రతిపాదించిన రూట్ లో మూడు రాజధానుల పైన ప్రజల్లో ఆకాంక్షలు ఉన్నాయని వివరించారు. ఎంత మంది యాత్రకు హాజరవుతారనే అంశం పైన నిర్వాహకులకే సమాచారం లేదని అభిప్రాయపడ్డారు. కోనసీమ జిల్లాలో ఇటీవల జిల్లా పేరు విషయంలో రెండు వర్గాలు ర్యాలీ చేయగా శాంతి భద్రతల సమస్యగా మారి మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగలబెట్టే వరకూ వెళ్లిందని గుర్తు చేసారు.

నేడు హైకోర్టులో విచారణ
అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం ఏర్పడుతోందని చెప్పుకొచ్చారు. ఈ పాదయాత్రలో ఏ చిన్న గొడవ జరిగినా, అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని డీజీపీ వివరించారు. దీని కారణంగానే పాదయాత్రకు అనుమతి ఇవ్వటం లేదని డీజీపీ స్పష్టం చేసారు. దీంతో..డీజీపీ తాజా ఉత్తర్వుల పైన నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. దీని పైన డీజీపీ ప్రస్తావించిన అంశాల పైన అమరావతి జేఏసీ కోర్టు ముందు తమ వాదనలు వినిపించ నుంది. దీనికి అనుగుణంగా హైకోర్టు తుది ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications