ఫేక్ న్యూస్ పై ఏపీ పోలీస్ సీరియస్ - వాట్సాప్ ఫిర్యాదుల కోసం కొత్త నంబర్..
ఏపీలో కరోనా వైరస్ తో పాటే దాని వ్యాప్తికి సంబంధించిన ఫేక్ న్యూస్ ప్రచారం కూడా పెరుగుతోంది. కరోనా వైరస్ పై ప్రజల్లో ఉన్న భయాలను వాడుకుంటూ సామాజిక మాధ్యమాల్లో తమకు ఇష్టమొచ్చిన సమాచారాన్ని ప్రచారం చేయడం సర్వసాధారణమవుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు ఏపీ పోలీసులు వాట్సాప్ నంబరును ప్రారంభించారు.
కరోనాను మించిన ఫేక్ ప్రచారం.. ఫిర్యాదుల కోసం వాట్సాప్..
ఏపీలో కరోనా వైరస్ కంటే దానికి సంబంధించిన ఫేక్ న్యూస్ ప్రచారం ఎక్కువైంది. ప్రతీ జిల్లాలో నమోదవుతున్న కేసులు, మృతుల సమాచారాన్ని ఇష్టారాజ్యంగా మార్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అలవాటుగా మారింది. దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో పనిచేసేలా వాట్సాప్ నంబరు 9071666667ను ఏపీ డీజీపీ సవాంగ్ ఇవాళ ప్రారంభించారు. కరోనాపై ఫేక్ న్యూస్ లు తమ దృష్టికి వస్తే ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఈ నంబరు అందుబాటులో ఉంచనున్నారు.
ఫేక్ న్యూస్ పై సెలబ్రిటీలతో ప్రచారం..
సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలను ప్రచారాన్ని నిలిపివేతకు చర్యలు తీసుకుంటున్నట్టు డీజీపీ సవాంగ్ ఈ సందర్భంగా తెలిపారు.
వాట్సాప్ నంబరు ప్రారంభించాక జూమ్ యాప్ ద్వారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నిఖిల్ సిద్దార్థ, అడవి శేషు ఆన్లైన్లో డీజీపీతో ఇంట్రాక్ట్ అయ్యారు. కరోనా ఫేక్ న్యూస్ పై యుద్ధానికి తమ వంతు సహకారం అందించాలని వీరిని డీజీపీ కోరారు. దీనికి వీరు అంగీకరించినట్లు తెలిసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తరఫున పీవీ సింధు కరోనాకు వ్యతిరేకంగా కొన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
— oneindiatelugu (@oneindiatelugu) April 15, 2020