రికార్డింగ్ డ్యాన్సు అడ్డుకున్నారని...పోలీసులను చితక్కొట్టారు:మసాజ్ సెంటర్ల ముసుగులో...
నెల్లూరు:రంజుగా సాగుతున్న రికార్డింగ్ డ్యాన్స్ను పోలీసులు ఆపేయమంటున్నారన్న కోపంతో గ్రామస్థులు వారిపై దాడి చేసి చితకబాదడంతో పోలీసులు తీవ్రం గాయపడిన వైనమిది. వివరాల్లోకి వెళితే...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం కొత్త సత్రంలో బుధవారం అర్థరాత్రి సమయంలో అశ్లీలమైన రికార్డు డ్యాన్సులను నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో కావలి రూరల్ ఎస్ఐ పుల్లారావు, కానిస్టేబుల్ క్రిష్ణయ్య, మరో ఇద్దరు హోంగార్డులతో కలసి హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. గ్రామంలో జరుగుతున్న ఆ రికార్డు డ్యాన్సులను అడ్డుకోబోయారు. దీంతో ఆగ్రహం చెందిన అక్కడి వ్యక్తులు పోలీసులపై దాడి చేశారు.
దీంతో వారి దాడిలో తీవ్రంగా గాయపడిన ఎస్ ఐతో సహా నలుగురు పోలీసులు తిరిగి కావలి పట్టణానికి చేరుకున్నారు. స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన హోమ్గార్డు నాగరాజు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి విషయమై సిఐ అశోక్వర్ధన్ను వివరాలు అడుగగా రికార్డు డ్యాన్సులు వేస్తున్నారని తెలిసి కొత్తసత్రం గ్రామానికి వెళ్లిన ఎస్ఐ పుల్లారావు, పోలీసులపై స్థానికులు దాడి చేసిన విషయం వాస్తవమేనన్నారు.
గాయపడిన వారికి ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామన్నారు. ఎస్ఐ పుల్లారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. సంఘటనకు కారకులైన వారిని త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.
మరోవైపు విజయవాడ మసాజ్ సెంటర్లలో బెజవాడ పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో టాస్క్ ఫోర్క్ పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి నగరంలోని మొగల్రాజపురం, లబ్బీపేట, గురునానక్ కాలనీల్లోని నాలుగు మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేశారు. వీటిల్లో క్రాస్ మసాజ్, వ్యభిచారం జరుగుతోందని నిర్ధారించుకున్నారు.
ఆ క్రమంలో ఇద్దరు మహిళా నిర్వాహకులతో పాటు 11 మంది వ్యభిచారం చేస్తోన్న మహిళలను, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. డైమండ్ బ్యూటీ పార్లర్, లా రాయల్స్ బ్యూటీ పార్లర్లపై వ్యభిచారం నిర్వహణ సంబంధిత కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో చాలా రోజులుగా బ్యూటీ పార్లర్, మసాజ్ సెంటర్ల ముసుగులో ఈ చీకటి బాగోతం నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.