Pawan kalyan:ఏపీ రాజకీయాల్లో కనిపించని జనసేనాని, బీజేపీ ట్వీట్స్ను రీట్వీట్: ఆందోళనలో కార్యకర్తలు
ఓ వైపు ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. మరోవైపు కొందరి ముఖ్య నేతల జాడ ఏపీలో కానరాడంలేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సంక్షేమ యుగం నడుస్తోంది. ప్రతి నెలా జగన్ సర్కార్ ప్రజలకు కావాల్సిన ఏదో ఒక సంక్షేమ పథకం ప్రవేశపెడుతోంది. అదే సమయంలో అభివృద్ధిని అట్టకెక్కించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి అభివృద్ధిపై ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించడం మానేశాయి. ఉన్న ప్రధాన ప్రతి పక్షం టీడీపీ కూడా మొన్నటి వరకు రాష్ట్రంలో అడ్రస్ లేదు. చంద్రబాబు నాయుడు ఎంతసేపు హైదరాబాదులో ఉండి జూమ్ మీటింగులు పెట్టడం తప్ప ఏపీలో ఉన్న పరిస్థితులపై స్పందించడంలో విఫలమవుతున్నారని తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ఇప్పుడు చర్చంతా జనసేనాని పవన్ కళ్యాణ్ వైపు మరులుతోంది.

పవన్ కళ్యాణ్ జాడెక్కడ
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో దేశం దృష్టి ఏపీ పై పడింది. అయితే దేశవ్యాప్తంగా చాలా మంది తమ అభిప్రాయాలను చెప్పారు కానీ టీడీపీ మాత్రం మౌనంగా ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇంత పెద్ద అంశం మీద స్పందించకపోవడం పై కూడా ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో పవన్ జాడ అస్సలు కనిపించడం లేదని ఇప్పటికే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఏదో అప్పుడప్పుడు ట్విటర్ వేదికగా ఒక లేఖ విడుదల చేయడం లేదా ఒక వీడియో ద్వారా మాట్లాడటం తప్పితే పవన్ కళ్యాణ్ ఏమి చేయడం లేదనే వాదన వినిపిస్తోంది.

లాక్డౌన్ నుంచి ఇంటికే పరిమితం
ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని చక్కర్లు కొట్టిన పవన్ కళ్యాణ్.. ఎన్నికల తర్వాత కూడా ఏపీలో బాగానే పర్యటనలు చేసి పలు విషయాలపై స్పందించారు. పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా సుగాలి ప్రీతికి న్యాయం జరిగే విషయంలో పవన్ కళ్యాణ్ పోరాడారు. ఇక కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో జనసేనాని కూడా ఇంటికే పరిమితం అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లు కూడా హైదరాబాదులోని తమ ఇంటికే పరిమితం అయినప్పటికీ ఒకటి రెండు సార్లు అమరావతిలో కనిపించారు. కానీ ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం లాక్డౌన్ విధించినప్పటి నుంచి అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా ఏపీలో అడుగుపెట్టకపోవడంపై అభిమానులు కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి క్రమంగా పెద్ద తలకాయలు పక్క పార్టీల వైపు చూస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పటికీ ఇవేమీ కార్యకర్తల్లో జోష్ నింపడం లేదు.

సినిమా షూటింగుల్లో కూడా పాల్గొనని పవన్
మార్చి నుంచి ఇప్పటి వరకు ఇంటికే పరిమితమైన పవన్ కళ్యాణ్... సినిమా షూటింగులకు అనుమతి లభించాక కూడా ఎలాంటి సినిమా చిత్రీకరణలో పాల్గొనలేదు. తాజాగా మరో రీమేక్ సినిమా చేసే యోచనలో పవర్ స్టార్ ఉన్నట్లు సమాచారం. ఆ సినిమా షూటింగ్ కోసం పొలాచ్చి వెళుతున్నట్లు సమాచారం. అక్కడే నెలరోజుల పాటు ఉంటారని తెలుస్తోంది. అయితే ఇది వచ్చే ఏడాది ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా ఘటన జరిగితే బలంగా ప్రశ్నించే పవన్ గొంతు విని దాదాపుగా ఏడెనిమిది నెలలైంది. అప్పుడప్పుడు ట్విటర్ పై స్పందించినప్పటికీ ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడితేనే ఎఫెక్ట్ ఉంటుందని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు.

రాజధాని విషయంలో బీజేపీతో బెడిసిందా..
ఇక జనసేన బీజేపీతో చేతులు కలిపినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ యాక్టివ్గా కనిపించడం లేదు. ఇందుకు కారణం మూడు రాజధానుల అంశంపై పవన్ పోరాటం చేద్దామని భావించినప్పటికీ.... బీజేపీ మాత్రం మూడు రాజధానులు కేంద్ర పరిధిలోకి రాదని తేల్చి చెప్పడం రాజధాని అంశంపై మాట్లాడకపోవడంతో జనసేనాని ఒక్కింత ఇరుకున పడ్డారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రాజధాని విషయంలో ఇటు బీజేపీ అటు జనసేన దారులు వేరయ్యాయి. ఇక సీఎం జగన్ అమిత్ షాను కలవడం, ఆ తర్వాత మళ్లీ ప్రధానిని కలవడంతో వైసీపీ కేంద్ర కేబినెట్లో చేరుతుందనే వార్తలు వచ్చాయి. ఒకవేళ అదే జరిగితే పవన్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతుందని చెబుతున్నారు.
Recommended Video

దీక్షలో ఉన్నారంటున్న సన్నిహితులు
ఒకప్పుడు మళ్లీ సినిమాల జోలికి పోనంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ ...ఇప్పుడు పార్టీ కంటే సినిమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సింది పోయి ఇంటికే పరిమితమై సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా అయితే పార్టీ బతకడం కష్టమే అని కూడా వారు హెచ్చరిస్తున్నారు. బీజేపీ చేసిన ట్వీట్లను తిరిగి రీట్వీట్ చేయడం తప్ప పవన్ కళ్యాణ్ ఏమి చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇంకా దీక్షలోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే బయటకు రావడం లేదని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఈ అక్టోబరుతో దీక్ష గడువు నాలుగు మాసాలు పూర్తవుతుంది కనుక పవన్ ఏపీలో అడుగుపెడతారో లేదో తెలియాలంటే వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications