పెట్రోల్ కార్లా ? వద్దు బాాబోయ్..! E20 దెబ్బకు సేల్స్ ఢమాల్- భారీ డిస్కౌంట్లు..!
ఇంధన భద్రత పేరుతో దేశంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20)ను తప్పనిసరి చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు వాహనదారుల్లో ఆందోళన పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ20 పెట్రోల్ పోసిన వాహనాల మైలేజీ తగ్గిపోవడం, ఇంజన్ సమస్యలు తలెత్తడంతో వాహనదారులు పునరాలోచన చేస్తున్నారు. దీని ప్రభావం పెట్రోల్ కార్ల అమ్మకాలపై పడింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెట్రోల్ కార్ల కొనుగోళ్లు భారీగా తగ్గిపోతున్నట్లు ఫెడరేషనన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) తెలిపింది.
ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ఇంజిన్లు పాడవుతాయనే అనుమానాలతో చాలా మంది కొనుగోలుదారులు పెట్రోల్ వాహనాలకు (Petrol Car) దూరంగా ఉంటూ, ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో షోరూమ్లలో పెట్రోల్ కార్ల నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ గణాంకాల ప్రకారం.. సాధారణంగా 30 నుండి 33 రోజులు ఉండాల్సిన డీలర్ల ఇన్వెంటరీ కాలపరిమితి, ఇప్పుడు ఏకంగా 60 నుండి 70 రోజులకు పైగా పెరిగింది. జూలై నెలలో హోల్సేల్ సరఫరా ఎక్కువగా ఉన్నా.. రిటైల్ విక్రయాలు తగ్గడంతో డీలర్ల వద్ద సుమారు 52 వేలకు పైగా అదనపు వాహనాలు నిలిచిపోయాయి.

ఒకప్పుడు కార్ల మార్కెట్లో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించిన పెట్రోల్ వాహనాలు, ఇప్పుడు సిఎన్జీ (CNG), ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), డీజిల్ వాహనాల నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. గతంలో పెట్రోల్ కార్ల మార్కెట్ వాటా చాలా ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు పెట్రోల్ వాహనాల వాటా 41.68 శాతానికి పడిపోగా, ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వాటా వేగంగా దూసుకుపోతూ 40.59 శాతానికి చేరుకుంది. మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే, డీజిల్ కార్ల డిమాండ్ మళ్లీ పుంజుకుంటోంది. ఇథనాల్ బ్లెండింగ్ ప్రభావం ప్రస్తుతానికి డీజిల్ ఇంజిన్లపై లేకపోవడంతో కొనుగోలుదారులు డీజిల్ మోడళ్లపై నమ్మకం ఉంచుతున్నారు. జూలైలో డీజిల్ వాహనాల మార్కెట్ వాటా 17.73 శాతానికి పెరిగింది. టాటా మోటార్స్ వంటి ప్రముఖ సంస్థలు కూడా తమ ఎస్యూవీ పోర్ట్ఫోలియోలో డీజిల్ కార్ల అమ్మకాలు పెరిగాయని ధృవీకరించాయి.

People have stopped buying petrol cars. Govt shud reverse its ethanol policy. Else it will hurt economy v badly https://t.co/BR67wVEzXo
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 9, 2026
పేరుకుపోయిన పెట్రోల్ కార్ల స్టాక్ను వదిలించుకోవడానికి డీలర్లు, వాహన తయారీ సంస్థలు భారీగా డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, ఐ20, టాటా నెక్సాన్, కియా సోనెట్ వంటి మోడళ్లపై రూ. 95,000 వరకు తగ్గింపు లభిస్తోంది. కొన్ని పాత స్టాక్, మరికొన్ని ఎంపిక చేసిన కొత్త మోడళ్లపై రూ.1.5 లక్షల నుండి రూ.3.5 లక్షల వరకు భారీ ఆఫర్లు అందిస్తూ కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పెట్రోల్ కార్ల భవిష్యత్తుపై అస్పష్టత కొనసాగుతున్న నేపథ్యంలో, కంపెనీలు తమ ఉత్పత్తి వ్యూహాలను మార్చుకోక తప్పడం లేదు. భవిష్యత్తులో డీలర్ల నష్టాలను తగ్గించేందుకు, వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టేందుకు సిఎన్జీ, ఈవీ వాహనాల ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది.




Click it and Unblock the Notifications