రేషన్ లబ్దిదారులకు తీపికబురు.. ఇకపై మరింత నాణ్యతతో రేషన్ బియ్యం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు శుభవార్త చెప్పింది. రేషన్ కార్డు లబ్దిదారులకు ఇచ్చే బియ్యం నాణ్యతను మెరుగుపరిచేందుకు కొత్త చర్యలు చేపట్టింది. ఇకపై రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యంలో నూకల శాతం గరిష్ఠంగా 10 శాతానికి పరిమితం చేశారు. ఈ నూతన విధానం సెప్టెంబర్ 1 నుంచి 17 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. వచ్చే నెలలో మరో 20 జిల్లాలకు విస్తరించనున్నారు.
బియ్యంలో నూకల శాతాన్ని 10కి తగ్గింపు
ఆ తర్వాత రెండు-మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్నారు .గతంలో రేషన్ బియ్యంలో దాదాపు 25శాతం వరకు నూకలు ఉండేవి. తర్వాత సార్టెక్స్ విధానం కింద 15శాతం నూకలున్న బియ్యాన్ని సరఫరా చేశారు. ఇప్పుడు నాణ్యతను మరింత పెంచాలనే ఉద్దేశంతో నూకల శాతాన్ని 10కి తగ్గించారు. ఇప్పటికే కొన్ని రేషన్ దుకాణాలకు కొత్త బియ్యం చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో పంపిణీ కూడా ప్రారంభమైంది.

సుమారు 4.35 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 2.31 లక్షల టన్నుల రేషన్ బియ్యం
గత నెలలో సరఫరా చేసిన 15 శాతం నూకలున్న బియ్యం నిల్వ ఉన్న చోట్ల ముందుగా వాటిని పంపిణీ చేస్తున్నారు. ఆ నిల్వలు అయిపోయిన తర్వాతే 10 శాతం నూకలున్న కొత్త బియ్యం అందుతుంది. రాష్ట్రంలో సుమారు 4.35 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 2.31 లక్షల టన్నుల రేషన్ బియ్యం పంపిణీ అవుతోంది. ఒక్క కిలో బియ్యానికి ప్రభుత్వానికి సగటున రూ.46 వరకు ఖర్చు అవుతోంది.
రేషన్ బియ్యం లబ్దిదారులకు ఉపయోగపడేలా నాణ్యత పెంపు
అయితే చాలా మంది కార్డుదారులు రేషన్ బియ్యాన్ని ఇంట్లో వాడుకోవటం లేదని, వ్యాపారులకు అమ్మేసి, తర్వాత మార్కెట్లో ఇతర బ్రాండ్ల బియ్యం కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు నాణ్యత పెంచి రేషన్ అందించనుంది. కార్డుదారులు నేరుగా రేషన్ బియ్యాన్ని వినియోగించేలా చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
భవిష్యత్తులో స్టీమ్ రైస్ను కూడా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
స్టీమ్ రైస్ పంపిణీ కోసం కేంద్రానికి విజ్ఞప్తి
ఇందుకోసం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అనుమతి కోరుతూ కమిషనర్ కన్నబాబు లేఖ రాశారు. అనుమతి లభిస్తే 10 శాతం నూకల పరిమితితో స్టీమ్ రైస్ కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో అనేక బ్రాండ్ల బియ్యం స్టీమ్ రైస్ రూపంలోనే అమ్ముడవుతోంది. కొన్ని రకాలు కిలో రూ.70 వరకు ఉన్నాయి. కొత్త రేషన్ బియ్యాన్ని క్యూఆర్ కోడ్ ఉన్న బస్తాల్లో సరఫరా చేస్తున్నారు.
29,844 రేషన్ దుకాణాలలో రేషన్ బియ్యం పంపిణీ
దీని వల్ల సరఫరా, పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 29,844 రేషన్ దుకాణాలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో ఈ నాణ్యమైన బియ్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత కార్డుదారులకు మెరుగైన నాణ్యత గల బియ్యం లభించే అవకాశం ఉంది. ఈ చర్యలు పేదలకు నిజమైన ప్రయోజనం చేకూరుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications