ఈ నాగలక్ష్మి దేశంలోనే అత్యంత ధనవంతురాలు: ఏపీ అంధ మహిళపై సోనూ సూద్ ప్రశంసలు
అమరావతి: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఆండ్రావారిపల్లెకు చెందిన అంధురాలు బొడ్డు నాగలక్ష్మి తన మంచి మనసును చాటుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయమైన ఆమె.. ఇప్పుడు తన సేవానిరతితో అత్యంత ధనవంతురాలిగా రియల్ హీరో సోనూ సూద్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.
Recommended Video
ఇతరులకు సాయం చేయడంలో నాగలక్ష్మి ఎప్పుడూ ముందే..
దివ్యాంగురాలైన నాగలక్ష్మికి నెల నెలా పెన్షన్ వస్తుంది. అయితే, ఆమెకు వచ్చే ఆ మొత్తాన్ని కూడా ఇతరులకు సాయం చేసేందుకు వెచ్చిస్తుండటం అభినందనీయం. తనకు చూపులేకపోయినప్పటికీ మంచి మనసు ఉందని ఆమె చాటుకున్నారు. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి అండగా నిలుస్తున్న సోనూ సూద్ ఫౌండేషన్కు ఆమె విరాళం అందించారు.
రియల్ హీరో సోనూ సూద్..
చాలా మంది సంపన్నులు కూడా ఈ కష్టకాలంలో సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. కరోనా ఫస్ట్ వేవ్లోనే వేలాది మంది వలస కార్మికులకు తమ స్వస్థలాలకు తరలించేందుకు బస్సులు, రైళ్లు, విమానాలను ఏర్పాటు చేసి రీల్ హీరో అయిన సోనూ సూద్.. రియల్ హీరో అయిపోయాడు. అంతేగాక, సాయం కావాలంటూ కోరిన వెంటనే ఆయన వెంటనే స్పందించి సాయం చేశారు. సెకండ్ వేవ్లోనూ సోనూ సూద్ తన సేవలను కొనసాగిస్తున్నారు. ఇందు కోసం ఓ ఫౌండేషన్ కూడా స్థాపించి తన సేవలను కొనసాగించేందుకు విరాళాలు స్వీకరిస్తున్నారు.
సోనూ సూద్ ఫౌండేషన్కు 5 నెలల పెన్షన్ విరాళమిచ్చిన బొడ్డు నాగలక్ష్మి
తాజాగా, సోనూ సూద్ ఫౌండేషన్కు బొడ్డు నాగలక్ష్మి తన 5 నెలల పింఛను డబ్బులు రూ. 15వేలను విరాళంగా అందజేశారు. సోనూ సూద్ చేస్తున్న సాయంలో భాగస్వామి అయ్యారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ ఆమె సాయంపై స్పందించారు. ఓ చిన్న గ్రామానికి చెందిన నాగలక్ష్మి తన ఫౌండేషన్కు రూ. 15వేలు విరాళంగా అందించారని సోనూ ట్వీట్ చేశారు.
బొడ్డు నాగలక్ష్మిపై సోనూ సూద్ ప్రశంసల వర్షం
అంతేగకా, తన వరకు ఈ దేశంలో అత్యంత ధనవంతురాలు నాగలక్ష్మినే అంటూ సోనూ సూద్ ప్రశంసంలు కురిపించారు. ఇతరు బాధను చూడటానికి నేత్రాలు అవసరం లేదు.. మంచి మనసుంటే చాలు ఆమె మరోసారి నిరూపించారని కొనియాడారు. ఆమె నిజమైన హీరో అంటూ సోనూ ప్రశంసించారు. అంతేగాక, ఆమెకు ఫోన్ చేసి కూడా అభినందించారు. దీంతో నాగలక్ష్మిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.