జులై 22 ఏపీకి ఎంతో కీలకం: కేవీపీ బిల్లుపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు జులై 22(శుక్రవారం)వ తేదీన చర్చకు రానుంది. చర్చ జరిగిన తర్వాత ఈ బిల్లుపై ఓటింగ్కు రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇందుకోసం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్తో ఏపీసీసీ చీఫ్ రఘువీరా, కేవీపీ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కేవీపీ పెట్టిన ప్రైవేటు బిల్లుపై ఈ భేటీలో చర్చించారు. ఈ బిల్లు కోసం ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రత్యేకహోదాపై బీజేపీ ఎన్నికలకు ముందు ఓ మాట, ఆ తర్వాత మార్చి మార్చి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ బిల్లుపై జరగే చర్చలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటోదనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ హయాంలో హామీ ఇచ్చామని, బీజేపీ సైతం ప్రత్యేక హోదాకు అంగీకరించిందని, ఓటింగ్కు బిల్లు వస్తున్న క్రమంలో విప్ను కూడా జారీ చేయాలని నిర్ణయించింది.
దీంతో ఈ బిల్లుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ, బీజేపీ ఎంపీలు సైతం అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లు విషయం ఏమవుతుందోనని యావత్ రాష్ట్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేవీపీ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా ఓట్లు పడతాయా? లేక బిల్లు వీగుతుందా? అనే ప్రశ్నలు సగటు మానవునిలో ఉదయిస్తున్నాయి.
కాగా మొత్తం మొత్తం 245 మంది సభ్యులు గల రాజ్యసభలో ఎన్డీయేకు 72 మంది సభ్యులున్నారు. బీజేపీ 54, టీడీపీ 6, శిరోమణి అకాలీ దళ్ 3, శివసేన 3, పీడీపీ 2, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, నాగా పీపుల్స్ ఫ్రంట్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథావలే), సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీలకు ఒక్కో సభ్యుడి చొప్పున ఉన్నారు.
రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న యూపీఏ తరుపున 66 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్కు 60, డీఎంకే 4, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ల తరుపున ఒక్కో సభ్యుడు ఉన్నారు. జనతా పరివార్ పార్టీకి 15 మంది సభ్యుల బలముండగా, జనతాదళ్ తరఫున 10 మంది, రాష్ట్రీయ జనతాదళ్ తరఫున 3, ఇండియన్ నేషనల్ లోక్దళ్, జనతాదళ్ సెక్యులర్ పార్టీలకు ఒక్కో సభ్యుడి చొప్పున ఉన్నారు.
ఇక రాజ్యసభలో ఇతర పార్టీలైన సమాజ్ వాదీ 19, అన్నాడీఎంకే 13 తృణమూల్ కాంగ్రెస్ 12, బిజూ జనతాదళ్కు 8, సీపీఐ (ఎం)కు 8, బీఎస్పీకి 6, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి 5, టీఆర్ఎస్కు 3, సీపీఐ, జార్ఖండ్ ముక్తి మోర్చా, వైసీపీలకు ఒక్కో సభ్యుడి చొప్పున ఉన్నారు.
వీరితో పాటు 10 మంది నామినేటెడ్ సభ్యులు, నలుగురు ఇండిపెండెంట్లు ఉండగా, ఒక సీటు ఖాళీగా ఉంది. కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుకు ఎన్టీఏతో పాటు యూపీఏకు ప్రత్యక్షంగా మద్దతు పలుకున్న పార్టీలన్నీ కూడా మద్దతు తెలుపనున్నాయి. ఇక అన్నాడీఎంకే, సమాజ్ వాదీ, తృణమూల్ పార్టీలు ఏ వైపు నిలబడతాయనేది ఆసక్తికరంగా మారింది.
సీపీఐ, సీపీఎం, వైసీపీ, బీఎస్పీలు కాంగ్రెస్కు మద్దతిచ్చేలా కనిపిస్తున్న తరుణంలో టీడీపీకి చెందిన ఆరుగురు సభ్యులు సైతం ఈ బిల్లుకు తప్పనిసరిగా ఓటు వేయాల్సిన పరిస్థితి. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎంపీలకు బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఇది అధికార పార్టీకి కాస్తంత ఇబ్బంది పెట్టేది. కేవీపీకి వచ్చిన ఆలోచన మనకెందుకు రాలేదని గతంలో చంద్రబాబు తన పార్టీ ఎంపీల దగ్గర ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎంపీ అయిన కేవీపీ పెట్టిన బిల్లుకు తప్పనిసరిగా మద్దతు పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో రాబోయే మూడు రోజుల్లో రాజ్యసభలో ప్రత్యక హోదా బిల్లుపై ఎలాంటి చర్చ జరుగుతుందో, ఓటింగ్ ఫలితమేంటోనని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.