ఎంపీ రఘురామపై క్రిమినల్ కేసు..!! ఈ సారి అధికారులే : తప్పుడు పత్రాలతో..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పైన మరో కేసుకు రంగం సిద్దం అవుతోంది. ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేసారనేది ఆయనపైన అభియోగం. దీంతో..రఘురామ పైన పరువు నష్టం దావా తో పాటుగా క్రిమినల్ కేసు దాఖలు చేస్తామని చెబుతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామ రాజు చాలా కాలంగా ప్రభుత్వ నిర్ణయాలను తప్పు బడుతున్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాల పైన ఢిల్లీ కేంద్రం గా నిత్యం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శిస్తున్నారు. రాజకీయంగా వైసీపీ అధినాయకత్వం వర్సెస్ రఘురామ రాజు మధ్య వార్ నడుస్తోంది.
ప్రభుత్వ నిర్ణయాలపై రఘురామ
ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన పైన అనర్హత వేటు కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఇప్పటి వరకు రఘురామ పైన చర్యలు లేవు. దీంతో..తన పైన అర్హత వేటు వేయించేలా ప్రయత్నాలు చేసుకోవాలని రఘురామ వైసీపీ ఎంపీలకు సవాల్ చేసారు. కొద్ది నెలల క్రితం సీఎం జగన్ పైన సీఐడి ఒక కేసులో అరెస్ట్ చేసింది. అది పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి కారణమైంది. ఆ తరువాత సుప్రీంలో బెయిల్ ద్వారా రఘురామ బయటకు వచ్చారు. ఆ తరువాత మరో కేసులో సంక్రాంతి సమయంలో సీఐడీ అధికారులు ఆయనకు హైదరాబాద్ లో ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని కోరారు. దీని పైన రఘురామ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
మద్యం అమ్మకాలపై ఆరోపణలు
ఇక, ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం అమ్ముతున్నట్టు గత కొన్నిరోజులుగా ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ తెలిపారు. ఎంపీ రఘురామ ఇచ్చిన వివరాల ప్రకారం ఎస్జీఎస్ ల్యాబ్స్కు బేవరేజస్ కార్పొరేషన్ లేఖ రాసిందని చెప్పుకొచ్చారు. పరీక్షించిన నమూనాల వివరాలను తెలియజేయాలని కోరినట్లు చెప్పారు. బీఐఎస్ ప్రమాణాల ప్రకారం పరీక్ష చేయాలని కోరలేదని.. శాంపిల్స్ ఎక్కడివో తెలియదని ఎస్జీఎస్ వెల్లడించిందని రజిత్ భార్గవ చెప్పుకొచ్చారు. ఇద్దరు వ్యక్తుల మద్యం నమూనాల్లో హానికరమైన పదార్థాలు లేవని ఎస్జీఎస్ వెల్లడించిందని ఆయన తెలిపారు.
పరువు నష్టం - క్రిమినల్ కేసు పెడతామంటూ
బేవరేజస్ కార్పొరేషన్పై దురుద్దేశాలు ఆపాదిస్తూ.. నివేదిక విడుదల చేసిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజుపై క్రిమినల్ కేసు పెడుతామని రజత్ భార్గవ్ పేర్కొన్నారు. రఘురామపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. మద్యం శాంపిల్స్కు లేబొరేటరీలో పరీక్షలు చేయించామని వారు చూపుతున్న పత్రాలు కూడా తప్పుడువేనన్నారు. చైతన్య, పవన్ అనే వ్యక్తులు గతేడాది డిసెంబర్ 11న నాలుగు విస్కీ, ఒక బ్రాందీ నమూనాలను అనధికారికంగా చెన్నైలోని ల్యాబ్కు పంపారని తెలిపారు. డిసెంబర్ 24న వారికి నివేదిక ఇచ్చినట్టు ఎస్జీఎస్ ల్యాబ్ తెలిపిందన్నారు. వీటిని ఏపీ నుంచి కొనుగోలు చేశారా, లేదా అనే విషయం తేలాలన్నారు. పరీక్షల కోసం నమూనాలను కల్తీ చేసి పంపారా, లేదా అనేదాన్ని గుంటూరులోని ప్రభుత్వ కెమికల్ ల్యాబ్ ఎగ్జామినర్ తేల్చాల్సి ఉందన్నారు.
కేసు నమోదు చేస్తారా
రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ లేబొరేటరీల్లో ఎప్పటికప్పుడు మద్యం నమూనాలను ఎన్నో విధాలుగా పరీక్షిస్తున్నామని తెలిపారు. 2021-22 (ఫిబ్రవరి వరకు)లో 1,47,636 శాంపిళ్లను పరీక్షించామని, ఎందులోనూ కల్తీ జరిగినట్టు, హానికర పదార్థాలు ఉన్నట్టు తేలలేదన్నారు. దీంతో..రజిత్ భార్గత ప్రకటన పైన రఘురామ ఎలా స్పందిస్తారనేది చూడాలి. ప్రభుత్వం సైతం రఘురామ పైన ఈ అంశంలో ముందుకు వెళ్తుందా లేదా అనేది సైతం ఆసక్తి కరంగా మారుతోంది.