త్వరలో ఎపి ఉద్యోగులు రాజధాని ప్రాంతానికి: బాబు
ఏలూరు: వీలైనంత త్వరగా రాజధాని ప్రాంతానికి ఉద్యోగుల తరలింపు ఉంటుందని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. నదుల అనుసంధానంతో ఊహించని ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు.
ఏపీలో అనేక సహజ వనరులు ఉన్నాయని, బైరైటీస్ నుంచి రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ హయాంలో అన్ని రంగాల్లో దోపిడీ జరిగిందని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట అని అన్నారు. భూమి లభ్యతను బట్టి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, భీమవరంలో మెరైన్ వర్సిటీ నెలకొల్పుతామని చంద్రబాబు తెలిపారు.
ఆగస్టు నాటికి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తవాలని ఆదేశించారు. ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమానికే పెద్దపీట వేసినట్లు చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానంతో ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో కాలువ పనులకు భూమి సమస్య లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి రద్దు చేశారని చంద్రబాబు విమర్శించారు. ఆయన మీడియా సమావేశంలోకూడా మాట్లాడారు.
పట్టిసీమ ప్రాజెక్టు వద్ద రైతులతో చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు. ప్రాజెక్టులపైనే రైతుల భవిష్యత్ ఆధారపడి ఉందని ఆయన అన్నారు. పట్టిసీమను కావాలని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అన్ని ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం జరిగితే నీటి సమస్య ఉండదని చంద్రబాబు చెప్పారు.