రమణదీక్షితులూ...పొట్ట నింపుకోవడానికి అన్యమతస్థుడు జగన్ ఇంటికే వెళ్లాలా?: ఆనంద సూర్య పశ్న
విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుపై రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రమణదీక్షితులుకు స్వామి వారి బంగారం కుంభకోణంలో కీలక పాత్ర పోషించాడన్నారు.
కళ్యాణమస్తు కోసం స్వామివారి బంగారాన్ని ముంబైకి తరలించిన రమణ దీక్షితులు అందులో 40 శాతం తరుగు చూపించారని ఆనంద సూర్య ఆరోపించారు. ఈ వ్యవహారంలో అప్పటి టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి రూ. వెయ్యి కోట్లకు పడగలెత్తారని ఆనంద సూర్య ఆరోపించారు. రమణ దీక్షితులు పొట్ట నింపుకోవడానికి అన్యమతస్థుడు జగన్ ఇంటికే వెళ్లాలా?...అని ఆనంద సూర్య ధ్వజమెత్తారు.
తిరుమల దేవస్థానంలో అర్ధరాత్రి, మిట్ట మధ్యాహ్నం డ్యూటీలతో అర్చకులను వేధించిన ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని, రాష్ట్రాన్ని అస్థిరపరచాలని బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాలకు రమణ దీక్షితులు సహకరిస్తున్నారని ఆనంద సూర్య ఆరోపించారు. ఇలాంటి కుట్రలకు ఆయన సహకరిస్తే బ్రాహ్మణులు ఆయనకు తగిన బుద్ధి చెబుతారని ఆనంద సూర్య దుయ్యబట్టారు. సంపంగి ప్రాకారంలోని వంటశాలలో నైవేద్యం చేయవచ్చని ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులు లేఖ ఇవ్వలేదా? అని ఆనందసూర్య నిలదీశారు.