ఏపీ పల్లెల్లో బెల్జియం పర్యాటకులు: గ్రామీణులతో మమేకం, ఏమేం చేశారంటే..(ఫొటోలు)
అమరావతి: పాశ్చాత్య దేశస్తులు మన సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతగానో ఇష్టపడతారు. వాటిని ఆచరించేందుకు కూడా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్లెల్లో పర్యటిస్తున్న బెల్జియం దేశస్తులు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. వారంతా ఇక్కడి పల్లెల్లో పల్లె జనాలతో కలిసి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమం గ్రామీణ పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. అంతర్జాతీయ పర్యాటకులకు మన గ్రామీణ వాతావరణాన్ని పరిచయం చేసే క్రమంలో రూపకల్పన చేసిన సంస్కృతి కార్యక్రమం ప్రస్తుతం బెల్జిజయం పర్యాటకులను విశేషంగా అకట్టుకుంటోంది.
సరికొత్త పర్యాటకం
ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతున్న దశలో మన గ్రామాలను, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేయటమే ధ్యేయంగా, వైవిధ్య భరితంగా పర్యాటక శాఖ చేపట్టిన కార్యక్రమం ఈ రంగంలో నూతన ఒరవడికి నాంది పలికింది.
ప్రత్యేకించి రాష్ట్రంలోని కొన్ని గ్రామాలు పలు ప్రత్యేకతలను సంతరించుకున్నప్పటికీ అవి పూర్తి స్ధాయిలో ప్రచారానికి నోచుకోలేదు. దీనిని అధిగమించే క్రమంలో ప్రత్యేకంగా 12 గ్రామాలను నాలుగు సమూహాలుగా విభజించిన పర్యాటక శాఖ అక్కడ సంస్కృతి కార్యక్రమానికి నాంది పలికింది. ఇది ప్రభుత్వ, ప్రవేటు భాగస్వామ్యంలో కొనసాగుతుండగా, ప్రస్తుతం తొలి అడుగు పడింది.
బెల్జియం జంటతోపాటు
తిరుపతి సమూహంలోని మాధవమాల గ్రామంలో బెల్జియం పర్యాటకులు లోలా స్నాకర్స్, అలెన్ వాటర్మెన్ మన తెలుగుదనాన్ని రుచి చూశారు. వారితో పాటు హైదరాబాద్కు చెందిన మమతా మల్లిపూడి, విశాల్ ఫెర్నాండెజ్, బెంగుళూరుకు చెందిన విజయ్ శర్మ మన పల్లె వాసుల ఆత్మీయతను స్వానుభవం ద్వారా అస్వాదించారు. గత రెండు రోజులుగా అక్కడ పర్యటిస్తున్న వారు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో వరి నాట్లు వేసారు.
స్థానికులతో మమేకమై..
బెల్జియంలో నగరాలకు మాత్రమే పరిమితమైన వీరు ఇక్కడ పలుగు, పారా చేత పట్టి వ్యవసాయ పనులను చేసారు. చేను గట్టున చద్దన్నం రుచి కూడా చూసారు. పూరిపాకలో తేనీరు తీసుకున్నారు. మన గోమాత పాలను పితికారు. చేతి పనులు నేర్చుకున్నారు. కళాకృతులు తీర్చి దిద్దటంలో సాయపడ్డారు. గ్రామీణ మహిళలతో ఉత్సాహంగా ఛాయా చిత్రాలు దిగారు. ఇలా బుధ, గురు వారాలలో వారు మాధవమాల గ్రామాన్ని వారంతా చుట్టేశారు.
ఆనందం, ఆహ్లాదం
సాధారణంగా ఇవన్ని సగటు తెలుగువారికి కొత్త కాకపోవచ్చు. ముందెన్నడూ చూడని పరదేశీయిలకు మాత్రం ఇవి ఆసక్తికరం, ఆహ్లాదకరమే. ఈ అంశం అధారంగా చేసుకునే సంస్కృతి కార్యక్రమానికి రూపకల్పన చేసామని పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
గ్రామీణ పర్యాటకం
తిరుపతి సమూహంలో శ్రీకాళహస్తి, మాధవమాల, వెంకటగిరి గ్రామాలను చేర్చగా, అనంతపురంలో ఈ ప్రాజెక్టు కింద లేపాక్షి, నిమ్మలకుంట, వీరాపురం గ్రామలను ఎంపిక చేశామన్నారు. ఇక రాజమండ్రి క్లస్టర్లో దిండి, నర్సాపూర్, ఉప్పాడ ఉండగా, చిత్తూరు జిల్లాలోనే మరో క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అంతర్జాతీయ పర్యాటకులకు స్వాగతం పలుకుతూ..
ప్రధానంగా గ్రామీణ పర్యాటకాన్ని అంతర్జాతీయ పర్యాటకులకు పరిచయం చేసే క్రమంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. సాధారణంగా పర్యాటకులు తమ సందర్శనలలో పలు అంశాలను నయనానందకరంగా చూడగలుగుతారు తప్ప భౌతికంగా అనుభూతిని పొందలేరు. దీనిని అధికమిస్తూ సంస్కృతి ప్రాజెక్టును పట్టాలెక్కించామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అధారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హిమాన్హు శుక్లా వివరించారు.
గ్రామీణ కళల పరిచయం
చేనేత వస్త్రాలను వారే నేయగలిగేలా ఏర్పాట్లు ఉంటాయని, కుండల తయారీ దగ్గర వారే వాటిని తయారు చేసుకోవచ్చని, ప్రతి అంశాన్ని స్వీయ అనుభవంతో ముడిపెట్టామని, ఇలా వారికి అనుభూతిని పంచేలా దీని రూపకల్పన ఉందని శుక్లా పేర్కొన్నారు. ఇందుకోసం గ్రామ చరిత్రను అధ్యయనం చేసి పూర్తి వివరాలను పర్యాటకులకు అందిస్తామన్నారు. గ్రామీణులకు ప్రత్యేకంగా శిక్షణను కూడా ఇస్తున్నామని, అతిధ్యానికి సంబంధించిన మెళుకువలు, గైడ్లుగా ఏలా వ్యవహరించాలి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు.
గ్రామీణుల నివాసాల్లోనే..
పర్యాటకులు గ్రామీణుల నివాసాలలోనే బస చేస్తారని, అయితే మలి దశలో ప్రతి గ్రామంలోనూ ఒక కార్యకలాపాల కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకోనున్నామన్నారు. అయా గ్రామాలలో నడకతో చిరు పర్యటన ద్వారా అంతా చూడగలిగేలా స్పష్టమైన ప్రణాళిక ఉంటుందన్నారు.
సాంస్కృతుల పరిచయం
ఈ తరహా పర్యాటక ప్యాకేజీ వల్ల జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని గడించగలవని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అయా ప్రాంతాలలో ప్రత్యేకంగా కొన్ని రకాల హస్తకళలు, చేనేత ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, కూచిపూడి నృత్య రీతుల గురించి పరిచయం చేయవలసిన ఆవశ్యకతను కూడా పర్యాటక శాఖ గుర్తించిందని ఆ క్రమంలోనే గ్రామీణ పర్యాటక అభివృద్ది ప్రాజెక్టును చేపడుతున్నామని వివరించారు.
పర్యాటక ప్రాంతాలు..
ఈ ప్యాకేజీలో భాగంగా విదేశీ పర్యాటకులు ఒకటి రెండు రోజులు గ్రామాలలోనే బస చేస్తారని, అక్కడి ఉత్పత్తుల కోనుగోలు నేపధ్యంలో గ్రామీణుల జీవన ప్రమాణ స్ధాయిలు పెరుగుతాయని మీనా వివరించారు. గ్రామీణ పర్యాటకం కోసం ఇప్పటికే వివిధ ఏజెన్సీలు అయా గ్రామాలలో పనిచేస్తున్నాయని, వారు ఈ గ్రామాలను పర్యాటక భరితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని తెలిపారు.
గ్రామీణ వాతావరణం పునర్ పరిచయం
గ్రామీణ విపణి సామర్ధ్యం సైతం పెంపొందుతుందని ఈ ప్రయోగం వల్ల ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ గ్రామీణ ప్రాంతాలు మెరుగు పడతాయని భావిస్తున్నామని చెప్పారు. నానాటికీ గ్రామీణ వాతావరణం కనుమరుగవుతున్న దశలో దానిని పునః పరిచయం చేయవలసిన అవసరం ఏర్పడిందని ముఖేష్ కుమార్ మీనా అన్నారు.