ఏపీ వాలంటీర్ల సంచలనం..!!
AP Volunteers: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటి దెబ్బ పడింది వాలంటీర్ల మీదే. వారి ఉద్యోగాలు గాల్లో దీపం అయ్యాయి. ఉందా? ఊడిందా? అనే దుస్థితిని ఎదుర్కొంటోన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో వాలంటీర్లపై వరాల సునామీ గుప్పించిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ప్రతి నెలా 10,000 రూపాయల జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. ఏ ఒక్క వాలంటీర్ను కూడా తాము తొలగించబోమంటూ పదే పదే చెప్పుకొచ్చారు.

తీరా అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే వాలంటీర్లకు తమ దెబ్బ రుచి చూపించారు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్. 10,000 రూపాయల జీతం మాట అటు ఉంచితే ఉద్యోగం ఉందా? లేదా? అనే భయాందోళనలతో గడుపాల్సిన పరిస్థితిలో పడ్డారు. ఈ నెల వృద్ధాప్య పింఛన్ పంపిణీ బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకు అప్పగించడమే దీనికి నిదర్శనం.
దీనిపై రాష్ట్ర వాలంటరీ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ హుమాయూన్ భాష, ఉపాధ్యక్షుడు వెంకట్.. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి లేఖ రాశారు. రాజీనామా చేయకుండా విధుల్లో పాల్గొంటోన్న వాలంటీర్లకు ప్రతి నెలా 10,000 రూపాయల వేతనాన్ని ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, దీన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు. అలాగే- వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడానికి అవసరమైన విధి విధానాలపై ఆదేశాలను జారీ చేయాలని కోరారు.
తమ జీతాలను నిలిపివేయాలంటూ అధికారుల నుంచి ఎలాంటి మౌఖిక, రాతపూరక ఆదేశాలు అందనప్పటికీ.. కొంతమంది పంచాయితీ డీడీఓలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోన్నారని, ఫలితంగా గందరగోళం ఏర్పడిందని హుమాయూన్ భాష అన్నారు. అన్ని పంచాయితీల్లో ఒకట్రెండు నెలలుగా జీతాలకు సంబంధించిన ఎలాంటి బిల్స్ పెట్టలేదని వాపోయారు.
ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ప్రవర్తిస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఇబ్బంది పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. డీడీఓలు కొందరు వాలంటీర్ల పట్ల అవహేళనగా మాట్లాడుతున్నారని, ఇది సరికాదని అన్నారు.
ఎన్నికల సమయంలో లక్షమందికి పైగా వాలంటీర్లు రాజీనామాలు చేశారని, అలాంటి వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని హుమాయూన్ భాష మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి విజ్ఞప్తి చేశారు. రాజీనామా చేసిన వాలంటీర్లను తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ అత్యున్నత స్థానాన్ని కల్పిస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
లక్షమందికి పైగా వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని, మానవతా దృక్పథంతో వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వెంటనే 10,000 రూపాయలకు జీతం పెంచడం, లక్షమందికి పైగా రాజీనామా చేసిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవడం, ఉద్యోగ భద్రత కల్పించడం, పాత బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications