అపాచీ హెలికాప్టర్ ను ఇరాన్ కూల్చేసింది.. గట్టిగా బదులిస్తాం: ట్రంప్ సంచలనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. హార్మూజ్ జలసంధి సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ దళాలు కూల్చివేశాయని ఆయన ప్రకటించారు. అయితే.. ఈ విమానం శత్రువుల దాడివల్లే కూలిందా..? లేదా..? అన్నదానిపై అమెరికా మిలటరీ ఇప్పటివరకు ఎటువంటి నిర్ధారిత సమాచారాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై సమగ్రమైన విచారణ కొనసాగుతోందని మాత్రమే స్పష్టం చేసింది.
ట్రూత్ సోషల్ లో ట్రంప్ చేసిన పోస్ట్ ప్రకారం.. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన జలమార్గంలో ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఇరాన్ బలగాలు "అత్యంత ఆధునిక అపాచీ హెలికాప్టర్ను" కూల్చివేశాయని మిలటరీ తనకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాపాయం లేకుండా బయటపడటం ఊరటనిచ్చే విషయమని ఆయన పేర్కొన్నారు. "ఘటనలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. వారిద్దరూ సురక్షితం. అయినప్పటికీ.. ఈ దాడికి అమెరికా తప్పక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది" అని ట్రంప్ స్పష్టం చేశారు.
నిజానికి.. మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ఒమన్ తీరానికి సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా అమెరికా సెంట్రల్ కమాండ్కు చెందిన AH-64 అపాచీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనకు గల కారణాన్ని మిలటరీ ఇంతవరకు వెల్లడించలేదు. "సదరు సైనికులను సుమారు రెండు గంటల్లోనే సురక్షితంగా రక్షించాం. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది" అని సెంట్రల్ కమాండ్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఒక ప్రత్యేకత ఉంది. అమెరికా మిలటరీ చరిత్రలో మొదటిసారిగా, ఒక అన్ మ్యాన్డ్ సర్ఫేస్ వెసెల్ (స్వయంప్రతిపత్తి కలిగిన నౌక) సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. 'యుఎస్ నేవీ కోర్సెయిర్' అనే అటానమస్ సర్ఫేస్ డ్రోన్ సముద్రంలో పడిపోయిన ఇద్దరు సిబ్బందిని గుర్తించి, రక్షించింది. అనంతరం వారిని సురక్షితంగా మరొక ప్రాంతానికి తరలించి, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా తీసుకువెళ్లారు.
కమాండ్ ప్రతినిధి, నేవీ కెప్టెన్ టిమ్ హాకిన్స్ మాట్లాడుతూ, డ్రోన్ యొక్క సామీప్యత, కార్యాచరణ సామర్థ్యాన్ని బట్టి దానిని ఈ రెస్క్యూ కోసం ఎంపిక చేశామని తెలిపారు. ఈ కోర్సెయిర్ 24 అడుగుల పొడవున్న అటానమస్ నౌక. ఇది భారీ బరువులను మోస్తూ సుదూర ప్రాంతాలకు ప్రయాణించగలదు. సముద్ర గస్తీ మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ సాంకేతికతను జోడించే బాధ్యతను ఈ ప్రాంతంలోని టాస్క్ ఫోర్స్ 59 చేపట్టింది.

సంఘటన జరిగిన రోజున న్యూయార్క్లోని జెఎఫ్ కె విమానాశ్రయంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, "ఎవరికీ గాయాలు కాలేదని" తెలిపారు. అయితే, మిలటరీ మాత్రం వారు 'స్టేబుల్ కండిషన్'లో ఉన్నారని పేర్కొంది. అపాచీ హెలికాప్టర్లు క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన దాడులకు, నిఘాకు ప్రసిద్ధి. ఇరాన్ పోర్టుల దగ్గర ఆంక్షలు విధించే క్రమంలో అమెరికా వీటిని వాడటం గమనార్హం. ఫిబ్రవరి చివరలో ఇరాన్తో ఘర్షణ మొదలైనప్పటి నుంచి ఐదు ఫైటర్ జెట్లు, ఏడు రీఫ్యూయలింగ్ విమానాలు, ఇతర పరికరాలను అమెరికా కోల్పోయినట్లు కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక వెల్లడించింది.












Click it and Unblock the Notifications