నారా లోకేష్-అమిత్ షా భేటీలో జరిగిందిదే ? కిషన్, పురంధేశ్వరి తీసుకెళ్లలేదా !
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో విపక్ష నేత చంద్రబాబును వైసీపీ సర్కార్ అరెస్టు చేసిన తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం ఉందంటూ టీడీపీ ఇన్నాళ్లూ ప్రచారం చేస్తూ వచ్చింది. ఇందుకు అనుగుణంగానే బీజేపీ నేతలు నోరు మెదపకపోవడంతో ఇదంతా నిజమేనని అంతా నమ్ముతూ వస్తున్నారు. అదే సమయంలో నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ నేత నారా లోకేష్ కలిశారు.
అనూహ్యంగా నిన్న ఢిల్లీలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, తన పిన్ని పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి నారా లోకేష్ అమిత్ షా తో భేటీ అయ్యారు. గతంలో చంద్రబాబుకు సైతం అపాయింట్ మెంట్ ఇవ్వకుండా దూరం పెట్టిన అమిత్ షా.. నిన్న తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులతో కలిసి వచ్చిన లోకేష్ తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే ఈ భేటీలో లోకేష్.. చంద్రబాబు అరెస్టుపై ఆయనకు ఫిర్యాదు చేయగా.. ఏం జరిగిందో తనకు తెలుసని అమిత్ షా చెప్పినట్లు వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఢిల్లీలో ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. అమిత్ షా తో లోకేష్ భేటీ ప్లీప్లాన్డ్ కాదని ఆయన వెల్లడించారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే అమిత్ షాను లోకేష్ కలిశారని వెల్లడించారు. ఈ భేటీలో ఏపీలో పరిణామాలను తనకు తెలుసని అమిత్ షా చెప్పినట్లు అచ్చెన్న తెలిపారు. అలాగే చంద్రబాబు అరెస్ట్ వెనుక తమ ప్రమేయం లేదని అమిత్ షా చెప్పారన్నారు.
మరోవైపు నిన్నటి భేటీలో లోకేష్ తో పాటు పురంధేశ్వరి, కిషన్ రెడ్డి కూడా పాల్గొనడంపైనా అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు.
లోకేష్, పురంధేశ్వరి, కిషన్ రెడ్డి కలిసి అమిత్ షాని కలవలేదన్నారు. లోకేష్ అక్కడికి వెళ్లేసరికే పురంధేశ్వరి, కిషన్ రెడ్డి అక్కడే ఉన్నారన్నారు. అదే సమయంలో లోకేష్ వెళ్లి అమిత్ షాను కలిశారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని వారి ముందే అమిత్ షాకు వివరించారన్నారు.












Click it and Unblock the Notifications