కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్, మోడీ పతనం ఖాయం!: టీడీపీ నేతల స్పందన
విజయవాడ: కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ఘన విజయం సాధించింది. మూడు లోకసభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోకసభ, జామ్కండి, రామనగర అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
ఇందులో శివమొగ్గ మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్, జేడీఎస్ కూటమి గెలిచింది. ఇది బీజేపీకి గట్టి షాక్. బీజేపీ సిట్టింగ్ స్థానమైన బళ్లారిని కోల్పోయింది. ఇది మరో భారీ షాక్. ఈ నేపథ్యంలో ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు శుభపరిణామం
కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు శుభపరిణామం అని ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత ఆదినారాయణ రెడ్డి మంగళవారం అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల కూటమి విజయం రాబోయే తెలంగాణ ఎన్నికలకు అద్దం పడుతోందని చెప్పారు.

తెలంగాణలోను ఇవే ఫలితాలు
డిసెంబర్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోను ఇవే ఫలితాలు వస్తాయని చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి విజయం తథ్యమని చెప్పారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్ని కుట్రలు చేసినా వారి ఆటలు మాత్రం సాగవని చెప్పారు.

గట్టి షాకిచ్చారు
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు గట్టి షాకిచ్చారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి ప్రజలు మద్దతుగా నిలిచారని చెప్పారు. బీజేపీకి కర్ణాటక ప్రజలు అప్పుడు, ఇప్పుడు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఉప ఎన్నికలు దేశంలో జరుగుతున్న పరిణామాలకు నిదర్శనమని చెప్పారు. రేపు డిసెంబర్ నెలలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోను మహాకూటమిదే విజయమని చెప్పారు.

ఎన్డీయే పతనం ఖాయం
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పతనం ఖాయమని సోమిరెడ్డి చెప్పారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కూడా మరోసారి ప్రభావం చూపారని మంత్రి చెప్పారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు మోడీ ప్రభుత్వంపై నెలకొని ఉన్న ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని చెప్పారు.












Click it and Unblock the Notifications