సముద్రం ముందుకొచ్చింది...అలలు ఎగసిపడ్డాయి:ముప్పు ముంచుకొస్తోందా?
విశాఖపట్టణం:కడలి కల్లోలం ఆంధ్ర ప్రదేశ్ తీరం వెంబడి పలు జిల్లాల్లో ఆందోళన రేపింది. సముద్రం అంతకంతకూ ముందుకు చొచ్చుకురావడంతో తీరం వెంబడి నివాసులు ఏం జరుగుతుందోనని వణికిపోయారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా తీరం వెంబడి వాసులందరనీ ఇదే భయం వెంటాడింది.
బుధవారం అమావాస్య కావడంతో, అమావాస్యకు ఒకరోజు ముందు ఇలాంటి అలజడి సాధారణమేనని స్థానికులందరూ తొలుత నిమ్మళంగానే ఉన్నారు. అయితే సముద్రంలోని అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో పాటు కడలి అంతకంతకూ ముందుకు చొచ్చుకురావడంతో క్రమంగా అందరిలోనూ ఆందోళన హెచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోనైతే సముద్రం ఏకంగా 100 అడుగుల మేర ముందుకు చొచ్చుకురావడం గమనార్హం.

సముద్రం...చొచ్చుకు వచ్చింది
విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంలో సముద్రం 50 అడుగుల మేరా ముందుకు చొచ్చుకురాగా శ్రీకాకుళం జిల్లాలో పోర్టు కళింగపట్టణం, బందరువానిపేట గ్రామాల్లో సముద్రం నివాస గృహాల సమీపానికి 100 అడుగుల మేర ముందుకు వచ్చింది. అలాగే జిల్లాలోని 11 తీర మండలాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఈ అలల ఉధృతికి తీరం వెంబడి ప్రజలు భీతిల్లారు. తీరంలో నిలిపిన తమ నాటుపడవలు కొట్టుకుపోకుండా కాపాడుకోవడం జాలర్లకు కష్టంగా మారింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు సమీపంలోని కొత్తపట్నం తీరంలో అలలు ఎగసిపడ్డాయి. కాగా, ప్రస్తుతం బంగాళాఖాతంలో రుతుపవనాల్లో బలం ఉందని, ఆ ప్రభావంతో తమిళనాడు నుంచి ఒడిశా వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉందని పేర్కొంది.

తీరం వెంబడి...అల్లకల్లోలం
సముద్రంలో అలలు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండడం వల్లే అలలు ముందుకొస్తున్నాయని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. రుతుపవనాల జోరు రెండు రోజుల్లో కాస్త తగ్గుతుందని, అప్పటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా వాయువ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లో మంగళవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని దీంతో బంగాళాఖాతం మొత్తం రుతుపవనాలు విస్తరించినట్టయిందని వాతావరణ శాఖ తెలిపింది.

ద్రోణి ప్రభావం...హెచ్చరికలు
పశ్చిమ బంగ్లదేశ్ వైపు నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకూ తీరం వెంబడి ఉపరితల ద్రోణి అవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర తీరప్రాంతంలో సముద్ర గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని.. ఈ కారణంగా అలల ఎత్తు కూడా పెరిగిందని సునామీ హెచ్చరికల సంస్థ స్పష్టం చేసింది. సముద్రపు అలల ఎత్తు 3.5 మీటర్ల నుంచి 4.1 మీటరు ఎత్తున ఎగసి పడే అవకాశం ఉండటంతో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేశారు. నెల్లూరులోని దుగరాజపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా బారువ వరకూ ఈ పరిస్థితి ఉందని ఇన్ కాయిస్ సంస్థ స్పష్టం చేసింది.

వర్షం కురిసింది...కురుస్తుంది...
పశ్చిమ బంగ్లదేశ్ వైపు నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకూ తీరం వెంబడి ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి...ఉత్తరకోస్తాలో ఉపరితల ఆవర్తనం, దానివల్ల ఏర్పడిన ద్రోణి ఫ్రభావంతో మంగళవారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. భూభాగం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని చాలా ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదు అవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications