వైసీపీ విజయసాయి రెడ్డి కొత్త సిరీస్ - పార్ట్-1లో ఆ రెండు కులాలు - ఎర్రన్నాయుడు ఫ్యామిలీపై అనూహ్యం..
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. మొన్నటి శ్రావణ శుక్రవారాన్ని చీకటి రోజుగా అభివర్ణించిన చంద్రబాబు.. అమరావతి పరిరక్షణ కోసం రెండో దశ ఉద్యమానికి పిలుపునిచ్చారు. బీజేపీ - జనసేన కూటమి సైతం రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని తరలింపు పనులతోపాటు రాజకీయ ప్రతివిమర్శల వ్యవహారాన్ని భుజానికెత్తుకున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.
రాజధానిపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం - తరలింపునకు ముందే 4 జోన్ల ఏర్పాటు - చైర్మన్లు ఎవరంటే..
చంద్రబాబుపై కొత్త సిరీస్..
టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా తన పదవీ కాలంలో రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని, ఎక్కడిక్కడ గిట్టని కులాలకు అన్యాయం చేశారని, ప్రాంతాలపై వివక్ష ప్రదర్శించారని ఆరోపించిన విజయసాయి.. ఆ సమస్యలకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారాలు చూపెడతారని, అందులో భాగంగానే మూడు రాజధానులు, కార్పొరేషన్ల ఏర్పాటు అని తెలిపారు. చంద్రబాబు విధానాలను విమర్శిస్తూ సాయిరెడ్డి కొత్తగా సిరీస్ మొదలు పెట్టారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో ఆదివారం నుంచి సిరీస్ మొదలుపెట్టిన ఆయన.. తొలిరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. పార్ట్-1లో భాగంగా కళింగ, రెడ్డిక కులాల పరిస్థితిని వివరించిన ఆయన.. రాబోయే పార్టుల్లో మిగతా విషయాలు వెల్లడిస్తానన్నారు. ఎంపీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
శ్రీకాకుళం జిల్లాను చిదిమేశాడు..
‘‘ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కళింగ, రెడ్డిక జనాభా చాలా ఎక్కువ. అందుకే ఆ కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది జగన్ ప్రభుత్వం. బీసీ "ఏ" కేటగిరీలో - లక్షల సంఖ్యలోనున్న ఆ కులాలకు తగిన చేయూతనిస్తూ పైకి తీసుకురావాలన్నదే లక్ష్యం. అయితే ఈ రెండు కులాలను ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తూ ... 14 ఏళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా జిల్లాలోని నాయకులు ఉద్దేశపూర్వకంగా వేధించేవారు. బీసీల్లోని బీసీలకే కయ్యంపెట్టి పబ్బం కడుపుకునే చంద్రబాబు రాజకీయాలకు బలైపోయారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు కుల రాజకీయాలను తారాస్థాయికి తీసుకెళ్తూ... ఆయా కులాల్లోని కొంతమందికి డబ్బులు పంచి... రెచ్చగొట్టి ... భయపెట్టి ఓట్లు కొట్టేయడమే పనిగా పెట్టుకున్నాడు.
జగన్ వచ్చాకే ఆ రెండు కులాలకు..
14ఏళ్ల చంద్రబాబు పాలనలో శ్రీకాకుళం జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ గానీ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిగానీ కళింగ లేదా రెడ్డిక కులాలకు దక్కలేదు. కనీసం డైరెక్టర్ పదవికూడా ఇవ్వలేదు. జగన్ అధికారం చేపట్టాక డీసీఎంఎస్ చైర్మన్ గా కళింగ వర్గానికి చెందిన పిరియా సాయిరాజ్ బాధ్యతలు చేపట్టారు. కనీసం నామినేటెడ్ పదవుల విషయంలో ఆ రెండు కులాలను చంద్రబాబు పట్టించుకోలేదు. శ్రీముఖలింగం, అరసవల్లి సూర్యదేవాలయం, శ్రీకూర్మం, లాంటి దేవాలయాల ట్రస్ట్ పదవుల్లో వారికి వాటా దక్కలేదు . ఎంతో మంది ఉన్నత విద్యావంతులున్నా కళింగ, రెడ్డిక వర్గాలను జగన్ ఆదరించారు. ఎచ్చెర్లలో ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీ వీసీగా కళింగ వర్గానికి చెందిన వ్యక్తికి వచ్చింది. విజయనగరంలో పెట్టబోయే కేంద్ర గిరిజన యూనివర్సిటీ మెంటర్ గా కళింగ వర్గానికి చెందిన లజపతిరాయ్ ను నియమించింది.
కాల్చి చంపినా పట్టించుకోలేదు..
ప్రభుత్వం ఇచ్చే ఉచిత గృహాల్లోనూ కళింగ, రెడ్డిక కులాలకు మొండిచేయి చూపేవారు. చంద్రబాబు హయాంలో రెడ్డిక కులాన్ని ఎంబీసీలుగా గుర్తించినా, ఒక్క రూపాయికూడా నిధులివ్వలేదు. రెడ్డిక కులానికి ఒక్కటంటే ఒక్క అసైన్డ్ ల్యాండ్ ను కేటాయించలేదు. టెక్కలి సమీపంలోని కాకరాపల్లిలో ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంట్ దగ్గర పోలీసుల కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ఆ నలుగురూ రెడ్డిక సామాజికవర్గానికే చెందినవారు కావడంతో.. సరైన ఎక్స్ గ్రేషియా కూడా దక్కలేదు. విశాఖలో ప్రమాదం జరిగితే జగన్ ప్రభుత్వం కోటి చొప్పున పరిహారం ఇచ్చింది.
Recommended Video
ఎర్రన్నాయుడి కుటుంబం వేధింపులు..
తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కళింగలకు ఇచ్చినా వారిపై ఎర్రన్నాయుడు కుటుంబం నిత్యం వేధింపులకు పాల్పడేది. అచ్చెంనాయుడు ఏకంగా 200 మంది కళింగ వర్గానికి చెందిన అధికారులను.. పాడేరు, చింతపల్లి, జీ మాడుగుల, రాయలసీమలాంటి ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ చేయించాడు. పలాస ఐసీడీఎస్ అధికారిణిగా ఉన్న వికలాంగురాలు, కళింగ వర్గానికి చెందిన ఒక అధికారిణిని ( శార్వాణి) ఏకంగా పాడేరు అడవులకు పంపించాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆమె వెనక్కివచ్చారు. అసైన్డ్ ల్యాండ్స్ నుంచి ప్రతిదానికి ఎర్రన్నాయుడి కుటుంబంలోని కొద్దిమంది కూర్చొని తీర్పులు చెప్పేవాళ్లు. కళింగ, రెడ్డిక వర్గాలకు చెందిన ఉద్యోగులు, ప్రజల్ని టీడీపీ తీవ్రంగా ఇబ్బందులు పెట్టింది'' అని విజయసాయి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుపై విమర్శల సిరీస్ లో త్వరలోనే పార్ట్-2 విడుదల చేస్తానని ఎంపీ తెలిపారు.