అరేబియా సముద్రంలో తుఫాన్- ఏపీకి భారీ వర్షసూచన చేసిన అమరావతి ఐఎండీ
Arabian Sea: ఎండలతో అల్లాడిపోతున్న ఏపీకి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తీపి కబురు వినిపించింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రత్యేకించి- దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొంది.
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సమయంలో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమ వరకూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

ఆ తరువాత మళ్లీ రుతు పవనాలు బ్రేక్ తీసుకున్నాయి. వాటి కదలికలు మందగించాయి. ఫలితంగా- ఉష్ణోగ్రత మళ్లీ మొదటికొచ్చింది. 40 డిగ్రీలకుపైగా ఎండ తీవ్రత కనిపించింది. వేడిగాలులూ వీచాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరికి గురి అయ్యారు. నడివేసవి పరిస్థితులను చవి చూశారు.
ఇప్పుడీ పరిస్థితి నుంచి ఉపశమనం లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సగలి కరుణసాగర్ వెల్లడించారు. గంటకు 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు.
నేడు, రేపు ఈదురు గాలుల తీవ్రత దాదాపు 50 నుండి 60 కిలో మీటర్ల వరకు ఉంటుందని 12వ తేదీ నుంచి దీని తీవ్రత 40 నుండి 50 కిలో మీటర్లకు తగ్గొచ్చని అంచనావేశారు. 12వ తేదీన తిరుపతి, చిత్తూరు జిల్లాలు మినహా నెల్లూరు, ప్రకాశం వంటి ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కరుణసాగర్ తెలిపారు.
అరేబియా సముద్రంలో తుఫాన్ తరహా వాతావరణ పరిస్థితులు నెలకొనడమే దీనికి కారణమని ఆయన విశ్లేషించారు. అరేబియా సముద్రం తూర్పు మధ్య- పశ్చిమ మధ్య ప్రాంతంలో ఈ తరహా వాతావరణం ఏర్పడిందని, మున్ముందు మరింత బలపడటానికి అవకాశం ఉందని కరుణసాగర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications