ఆరేసుకోబోయి పారేసుకున్నాను: చీప్ లిక్కర్తో బోర్లా: పార్టీ ఆఫీస్లో చీప్గా: ఈ ఏపీ బీజేపీకి ఏమైంది
విజయవాడ: ఈ ఏపీ బీజేపీకి ఏమైంది? మొన్న చీప్ లిక్కర్ కామెంట్స్..ఇప్పుడు ఏకంగా పార్టీ కార్యాలయంలోనే చీప్గా చిందులు వేసిన నాయకులు. బీజేపీ ఏపీ రాష్ట్రశాఖ నాయకులు తమ విధానాలను గానీ మార్చుకున్నారా?, పార్టీ సిద్ధాంతాలను అటకెక్కించారా?.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేర్పించిన సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేశారా?..ఆర్ఎస్ఎస్ భావజాలానికి పుల్స్టాప్ పెట్టేశారా?.. అనే అనుమానాలు తలెత్తడం ఖాయం.
చీప్ లిక్కర్ కామెంట్స్తో తల బొప్పి..
మొన్నటికి మొన్న విజయవాడలో నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభ సందర్భంగా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్ లిక్కర్పై కామెంట్స్.. ఇప్పటికీ సద్దు మణగట్లేదు. దీని మీద రాజకీయ ప్రత్యర్థులు విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం బకాయిలు, ప్రత్యేక హోదా డిమాండ్లను పక్కన పెట్టి, 2024లో తాము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామంటూ ప్రకటనలు ఇవ్వడాన్ని అందరూ తప్పు పట్టారు.
దారి మళ్లించడానికే..
ఈ విషయంలో ముప్పేట దాడిని ఎదుర్కొన్నారు బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు. వారి తల బొప్పి కట్టింది. దీన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక తికమకకు గురయ్యారు. సోము వీర్రాజు చేసిన చీప్ లిక్కర్ కామెంట్స్ వ్యవహారాన్ని దారి మళ్లించడానికి గుంటూరులో జిన్నా టవర్, విశాఖపట్నంలో కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్పు డిమాండ్ను తెర మీదికి తీసుకొచ్చారనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి. పార్టీ కేంద్ర నాయకత్వం కూడా వివరణ కోరిందంటూ వార్తలొచ్చాయి.
కొత్త సమస్య..
దీన్నుంచి ఎలా బయట పడాలో తెలియక తల పట్టుకున్న బీజేపీ నాయకుల నెత్తిన ఇప్పుడు మరో సరికొత్త సమస్య వచ్చి పడింది. మరిన్ని విమర్శలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండక తప్పదనే సంకేతాలను పంపించింది. ఈ తాజా ఉదంతం నుంచి బయట పడటానికి, దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇంకేం మతపరమైన అజెండాను వెతుక్కుంటోందననే సందేహాలు వెలువడటానికి సైతం కారణమైందీ తాజా ఘటన. కొత్త సంవత్సరం నాడు విజయవాడ బీజేపీ సిటీ కార్యాలయంలో చోటు చేసుకుంది ఇది.
ఆరేసుకోబోయి పారేసుకున్నాను..
బీజేపీ విజయవాడ సిటీ పార్లమెంట్ నియోజకవర్గం కార్యాలయంలో కొందరు నాయకులు చిందులేశారు. ఎన్టీ రామారావు ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటకు అద్దిరిపోయేలా స్టెప్స్ వేశారు. మహిళా నాయకులు సైతం ఫుల్ జోష్లో కనిపించారు ఈ వీడియోలో. నీ కౌగిలింతలోనే.. అంటూ మైమరిచిపోయి చిందులేశారు. ఎన్టీఆర్ హావ భావాలతో విరగదీశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తోంది. వైరల్గా మారింది. బీజేపీ నాయకుల తీరు ఇదీ అంటూ ప్రపంచానికి తెలియజేసినట్టయింది.
నెటిజన్ల ట్రోల్..
దీనిపై రాజకీయ ప్రత్యర్థులు తమ విమర్శలకు పదును పెట్టారు. ఘాటు పదాలతో బీజేపీపై ఆరోపణాస్త్రాలను సంధిస్తోన్నారు. ఉత్తరాది సంస్కృతిని ఏపీ బీజేపీ నాయకులు బాగా వంట బట్టించుకున్నారంటూ ఎద్దేవా చేస్తోన్నారు. నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. ఈ వీడియోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డికి ట్యాగ్ చేస్తోన్నారు. ఏపీ బీజేపీ అధోగతి పడుతోందంటూ మండిపడుతున్నారు. ఆర్ఎస్ఎస్ నేర్చించిన సంస్కృతి ఇదేనా అంటూ నిలదీస్తోన్నారు.