రాజకీయ కక్షతోనే మల్లాది విష్ణు అరెస్ట్: ముమ్మాటికీ కోర్టు ధిక్కరణేనన్న రఘువీరా
విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్ట్పై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతోనే మల్లాది విష్ణుని అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. మల్లాది విష్ణు అరెస్ట్ కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆయన పేర్కొన్నారు.
కల్తీ మద్యం కేసులో గురువారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత మల్లాది విష్ణుతో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్లాది విష్ణుని కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి చేయాల్సిందిగా సూచించారు.
దీంతో కోర్టుకు వెళ్లేలోపు మల్లాది విష్ణు తన పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. ఈరోజు ఉదయం వారిద్దరినీ పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. పోలీసుల ముందు విచారణకు హాజరైతే, అరెస్ట్ ఉండబోదని కోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో మల్లాది విష్ణు అజ్ఞాతం వీడారు.
స్వర్ణ బార్ లైసెన్స్దారుల్లో విష్ణు తల్లి త్రిపురసుంరమ్మ మినహా భాగవతుల శరశ్చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కెఎ లక్ష్మిని కూడా పిలిపించిన సిట్ అధికారులు కృష్ణలంక పోలీసు స్టేషన్లోని ప్రత్యేక గదిలో విష్ణుతో పాటు మిగిలినవారిని ఎదరెదురుగా కూర్చోబెట్టి విచారించారు.
సిట్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఆధ్వర్యంలోని అధికారుల బృందం వారిని పలు వివరాలు అడిగారు. తొలి రోజు బుధవారం విచారణలో చెప్పిన విషయాలనే విష్ణు గురువారంనాడు కూడా చెప్పినట్లు సమాచారం. లైసెన్స్దారులు చెబుతున్న విషయాలతో పోల్చి చూస్తే విష్ణు చెప్పిన విషయాలు కొంత తేడాగా ఉన్నట్లు తెలిసంది. దీంతో విష్ణుతో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్ను సిట్ అధికారులు అరెస్టు చేశారు.