బేషరతు మద్దతు ప్రకటించిన షర్మిల
RG Car gang rape: కోల్కతలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దుమారం రేపుతోంది. రోజురోజుకూ దీని తీవ్రత పెరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి.
ఈ నెల 9వ తేదీన ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాలులో జూనియర్ డాక్టర్ ఒకరు మృతదేహమై కనిపించిన విషయం తెలిసిందే. శరీరంపై దుస్తులు లేని స్థితిలో ముఖం, చేతులపై తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యమైంది. హత్య చేయడానికి ముందు ఆమె గ్యాంగ్రేప్కు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఈ అత్యాచారం, హత్యోదంతానికి నిరసనగా మెడికోలు, జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేన్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 24 గంటల పాటు నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో వైద్య సేవలు స్తంభించిపోయాయి. ఔట్ పేషెంట్ విభాగాలు మూతపడ్డాయి.
ఈ దారుణ ఘటనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. మానవాళిపై జరిగిన దాడిగా అభివర్ణించారు. మానవత్వానికి మాయని మచ్చగా పేర్కొన్నారు. వైద్య సిబ్బంది అంటే దేవదూతలతో సమానమని, అలాంటి వారిని భక్షించే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక మహిళగా ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని వైఎస్ షర్మిల అన్నారు. హత్రాస్ ఉదంతం, కుల్దీప్ సింగ్ సెంగార్, ఆశారాం బాపూ, డేరా బాబా సాగించిన నేరాలను గుర్తు చేశారు. వారికి ప్రభుత్వాల రక్షణ కూడా అందిందని ఆరోపించారు. ఈ అత్యాచారాలు, హత్యల నుంచి మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు దోషులకు రక్షణ కవచంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
కోల్కతాలో మెడికోపై జరిగిన దారుణమైన అత్యాచారం మరియు హత్య, మానవాళిపై ఒక తీవ్రమైన దాడి. ఒక మాయని మచ్చ. ఇది అత్యంత పాశవిక చర్య. అన్నివిధాలుగా, ఖండించదగినది. రోజులు గడిచిపోతున్నాయి. కానీ కేసులో పురోగతి కనపడట్లేదు. మానవజాతి సిగ్గుపడే ఈ సంఘటనలో పూర్వాపరాలు బయటకు వస్తుంటే వెన్నులో వణుకు…
— YS Sharmila (@realyssharmila) August 17, 2024
కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు తమ రాజకీయ కుమ్ములాటలు పక్కన పెట్టాలని, విమర్శలు, ప్రతి విమర్శలకు ఇది సమయం కాదని షర్మిల సూచించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా తక్షణ చర్యలను తీసుకోవాల్సిన అవసరం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు.
నిర్భయ ఉదంతం తరువాత కాంగ్రెస్ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి యూపీఏ ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టిందని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. మహిళల భద్రతకు తగినన్ని నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రబుత్వం మహిళల భద్రతకు 7,214 కోట్లు కేటాయించగా..అందులో 5,000 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తరపున బేషరతుగా మద్దతు ప్రకటించారు. వారి డిమాండ్లను తక్షణమే నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బందిలో నెలకొన్న భయాందోళనలు పోగొట్టేలా దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications