సీపీఎస్ రద్దుపై ఛలో అసెంబ్లీకి ఎన్జీవోల మద్దతు:అశోక్బాబు;ఆయన జోక్యం అనవసరం:బొప్పరాజు
విజయవాడ:సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయసంఘాలు ఈ నెల 18న చేపట్టనున్న ఛలో అసెంబ్లీ ముట్టడికి తాము మద్దతు ఇస్తున్నట్టు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్బాబు ప్రకటించారు.
సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అశోక్బాబు పిలుపునిచ్చారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. దీని కోసం నవంబర్ 15న జాతీయ స్థాయి సమ్మెకు ఉద్యోగులు దిగుతున్నారని వివరించారు. దీనికి ముందుగా అక్టోబర్ 23న ఛలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.
అంతకుముందు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సిపిఎస్) రద్దు కోసం ఈ నెల 18న చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఫ్యాప్టో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 17లోపు సిపిఎస్పై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించకపోతే అసెంబ్లీ ని ముట్టడిస్తామని ఫ్యాప్టో చైర్మన్ పి బాబురెడ్డి, సెక్రటరీ జనరల్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించగా... ఎపి ప్రభుత్వం ఇంకా స్పందించని నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికే సంసిద్దమవుతున్నారు.
సిపిఎస్ రద్దు కోరుతూ జులై 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జీపు జాతాలు, ఆగస్టు 11న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించామని...సెప్టెంబర్ 1న చలో కలెక్టరేట్లను చేపట్టినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని ఫ్యాప్టో నేతలు తెలిపారు. ఇదే అంశంపై పిడిఎఫ్ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీయడంతో, ఈ నెల 10న ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీనిచ్చారన్నారు.
అయినప్పటికీ ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని...దీంతో ఈ నెల 17లోగా సిపిఎస్పై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించకపోతే చలో అసెంబ్లీ చేపడతామని హెచ్చరిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేష్ కుమార్కు ప్రత్యక్ష చర్య నోటీసును అందజేసినట్లు వారు వెల్లడించారు. అయినా స్పందన లేకపోవడంతో అసెంబ్లీ ముట్టడికి సిద్దమవుతున్నట్లు స్పష్టం చేశారు. ఫ్యాప్టో చేపట్టిన చలో అసెంబ్లీకి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) ప్రకటించింది.
ఇదిలావుండగా విఆర్వోల పదోన్నతుల అంశంలో ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు జోక్యం సరికాదని పీఆర్ఎస్ఎ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తప్పుబట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...విఆర్వోలకు ప్రమోషన్లు ఇచ్చేందుకు ఏపీ రెవెన్యూ సర్వీసుల సంఘం వ్యతిరేకం కాదని, అయితే ఈ సమస్య పరిష్కారం అవుతున్న దశలో ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. రెవెన్యూశాఖ పరిధిలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టంచేశారు.