జగనన్న స్మార్ట్ టౌన్ : మధ్యతరగతి సొంతింటి కల నెరవేరేలా.. దరఖాస్తులకు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి , జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండీ అనేక పథకాలను, రాష్ట్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ముందుకు వెళుతున్నారు . రాష్ట్రంలో ప్రతిపక్షాల నుండి నిత్యం పెద్దఎత్తున తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నా, వాటిని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి సరికొత్త వ్యూహాలతో, సరికొత్త కార్యక్రమాలతో సాగుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా జగనన్న స్మార్ట్ టౌన్ పేరుతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం చెయ్యనున్నారు .

జగనన్న స్మార్ట్ టౌన్ పథకానికి శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇప్పటికే ఇళ్ల స్థలాలు అందిస్తున్న ఏపీ సర్కార్, ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు, అల్పాదాయ వర్గాల వారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇళ్ళు లేని వారు ఎవరూ ఉండకూడదు అని భావిస్తున్న జగన్ సర్కార్ అందులో భాగంగా జగనన్న స్మార్ట్ టౌన్ పథకానికి శ్రీకారం చుట్టింది .
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఈ మేరకు మధ్యతరగతి వర్గాల వారికి ఇళ్ల స్థలాలను అందించడానికి వీఎంసి కమిషనర్ ఓ ప్రకటన సైతం విడుదల చేశారు.

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో.. ఐదు కిలోమీటర్ల దూరంలో ఇళ్ళ స్థలాలు
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఐదు కిలోమీటర్ల దూరంలో అందుబాటులో ఉండేలా ఇళ్ళ స్థలాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఇక మధ్యతరగతి వారికి అందించే ఈ స్థలాలను అన్ని వసతులతో ను అభివృద్ధి చేసి అందిస్తామని వివరించారు. విశాలమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిదీపాలు ఏర్పాటు చేయడంతో పాటుగా పార్కులు , మౌలిక సదుపాయాల కొరకు ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. కమ్యూనిటీ హాల్ , పాఠశాల భవనాన్ని, ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు .

అన్ని వసతులతో సొంతింటి కల తీరేలా , దరఖాస్తుకు అర్హతలు ఇవే
షాపింగ్ సెంటర్, బ్యాంక్, మార్కెట్ వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలం మొదలగు అన్ని వసతులను కూడా కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
వాటర్ , విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు . మూడు లక్షల నుండి 18 లక్షల లోపు సంవత్సరాదాయం కలిగిన వారందరూ ఈ పథకానికి అర్హులని, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ పథకం లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు . 150 చదరపు గజాలకు, అంటే మూడు సెంట్ల స్థలానికి సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు ఉండాలని పేర్కొన్నారు .

నేడు, రేపు డిమాండ్ సర్వే .. అవకాశం అంది పుచ్చుకోవాలని ప్రభుత్వ సూచన
200 చదరపు గజాలకు అంటే నాలుగు సంఖ్య సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి ఆరు లక్షల నుండి 12 లక్షల రూపాయలు ఉండాలని , 240 చదరపు గజాల కు అంటే ఐదు సెంట్ల కు సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి 12 లక్షల నుండి 18 లక్షల రూపాయలు ఉండాల్సి ఉంటుందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. దీనిలో భాగంగా సచివాలయ సిబ్బంది ఈరోజు, రేపు డిమాండ్ సర్వే నిర్వహిస్తున్న కారణంగా అర్హులైన నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని , దరఖాస్తు చేసుకోవచ్చని విజయవాడ నగర కమిషనర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications