APSRTC: చంద్రయాన్ 3 చూడటానికి ప్రత్యేక బస్సులు- ఛార్జీలు, టైమింగ్ వివరాలివే
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్- మిషన్ చంద్రయాన్ 3. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన అనంతరం దీనికి శ్రీకారం చుట్టింది ఇస్రో. చంద్రయాన్ 2 చేదు అనుభవాలను మిగిల్చిన నేపథ్యంలో అవి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది.
ఈ నెల 14వ తేదీన చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్ను ప్రయోగించనుంది ఇస్రో. దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే చంద్రాయన్ స్పేస్ క్రాఫ్ట్ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్కు చేరుకుంది. దీన్ని జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మార్క్-3తో అనుసంధానించింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి మోసుకెళ్లేది ఈ రాకెట్టే.

ప్రయోగించిన తేదీ నుంచి 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఈ రాకెట్. ఆగస్టు 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యేలా ఇస్రో ప్రణాళికలను వేసుకుంది. రోవర్ను చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేయాలనేదే ఇస్రో ప్రయత్నం. గతంలో చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైన నేపథ్యంలో ఆ చేదు ఘటన పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది.
ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్ కేంద్రానికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడిపించనున్నారు. శ్రీకాకుళం, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం నుంచి ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు శ్రీహరికోటకు బయలుదేరుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం, నెల్లూరు బీచ్, పులికాట్, నేలపట్టు పక్షుల అభయారణ్యాలను సందర్శించిన అనంతరం రాకెట్ లాంచింగ్ ప్రదేశానికి చేరుకుంటుంది.

అనంతరం 14వ తేదీన రాత్రి 8 గంటలకు శ్రీహరికోట నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం శ్రీకాకుళానికి చేరుకుంటుంది. ఈ బస్సులో రాకపోకలు సాగించడానికి ప్రయాణికులు 4,100 రూపాయల ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. ఇక ధర్మవరం నుంచి రెండు బస్సులను నడిపించనున్నట్లు వెల్లడించారు ఆర్టీసీ అధికారులు.
ఇందులో ఒకటి ఎక్స్ప్రెస్ సర్వీస్. ఇందులో ఛార్జీ రానుపోను 1,040 రూపాయలు. మరొకటి సూపర్ లగ్జరీ. ఇందులో ఛార్జీ 1,350 రూపాయలు. ఈ రెండు బస్సులు కూడా ఈ నెల 13వ తేదీన అర్ధరాత్రి 12 గంటలకు ధర్మవరం నుంచి శ్రీహరికోట షార్ కేంద్రానికి బయలుదేరి వెళ్తాయి. 14వ తేదీన ఉదయం షార్ కేంద్రానికి చేరుకుంటాయి. మళ్లీ అదే రోజు రాత్రి ధర్మవరానికి తిరుగు ప్రయాణమౌతాయి.
చంద్రయాన్ 3 ప్రయోగాన్ని వీక్షించదలిచిన వారు ముందుగానే తమ పేర్లను ఇస్రో అధికారిక వెబ్సైట్లో అయిదు రోజుల ముందుగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ ధర్మవరం డిపో అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల డిమాండ్ను బట్టి ఇతర ప్రాంతాల నుంచి కూడా శ్రీహరికోటకు ప్రత్యేక బస్సులను నడిపిస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications