శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం నాడు 55,756 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 17,866 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 2.71 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
రద్దీ తగ్గడం వల్ల కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండనక్కర్లేదు. క్యూలైన్ల ద్వారా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని టీడీపీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్నారు.

శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ నెల 21 వ తేదీన ఈ ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. 23వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేలా సాలకట్ల వసంతోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ.
ఏప్రిల్ 21వ తేదీన తెల్లవారు జామున 6:30 గంటలకు వసంతోత్సవాలు ఆరంభమౌతాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
రెండవ రోజున శ్రీ భూ సమేత మలయప్ప స్వామివారు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహిస్తారు. తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.

చివరిరోజైన ఏప్రిల్ 23వ తేదీన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. ఈ మూడు రోజుల పాటు సాయంత్రం 6 నుంచి 6:30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.
వసంత రుతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. దీన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 23న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.












Click it and Unblock the Notifications