హైద్రాబాద్పై అసద్ ప్రశ్నల వర్షం: 2014లోగా టి: షిండే
న్యూఢిల్లీ: మంత్రుల బృందం(జివోఎం) భేటీకి మంగళవారం హాజరైన మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పైన ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న అంశంపై ఆయన ప్రశ్నలు వేశారు.
మహారాష్ట్ర నుండి గుజరాత్ విడిపోయినప్పుడు ముంబైని యూటి చేశారా? పూర్వపు మైసూరు రాష్ట్రాన్ని విభజించినప్పుడు మైసూరును యూటి చేశారా? అని ప్రశ్నించారు. అదే సమయంలో ఆంటోని నివేదిక పైన ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే తాను ఎలాంటి నివేదికను ఇవ్వలేదని ఆంటోని క్లారిటీ ఇచ్చారు.

2014లోగా తెలంగాణ: షిండే
తెలంగాణ ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుందని సిపిఐ నాయకులు నారాయణ, విల్సన్లు షిండేను ప్రశ్నించారు. అందుకు ఆయన 2014లోగా తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. విభజన విషయంలో బిజెపి వైఖరి పైన సిపిఐ అనుమానం వ్యక్తం చేయగా.. జాతీయస్థాయిలో ఆ పార్టీ నిర్ణయం తీసుకుందని వెనక్కి తగ్గదని షిండే చెప్పారు. సిపిఐ వైఖరిని గులాం నబీ ఆజాద్ కూడా ఆరా తీశారు.
అన్ని పార్టీలను కూర్చోబెట్టాలి: నారాయణ
జివోఎం భేటీ అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ... అన్ని పార్టీలను ఒకేసారి కూర్చోబెట్టాలని, వేర్వేరుగా భేటీ అయితే తలోమాట చెబుతారన్నారు. పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని తాము కోరామన్నారు. అలాగే సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించామన్నారు. హైదరాబాదును యూటి చేస్తే ఉపయోగముండదని చెప్పారు.












Click it and Unblock the Notifications