సమైక్యమేకానీ, నేనే గన్మెన్ లేకుండా తిరుగుతా: అసద్
సీమాంధ్ర కేంద్రమంత్రులు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేయాలని, యూటిగా చేయాలని కోరుతున్నారని, ఇది సరికాదన్నారు. తాము దానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ముఖ్యమంత్రి అయ్యేందుకే మాట్లాడుతున్నారు తప్పు తెలంగాణపై ప్రేమతో కాదన్నారు. సీమాంధ్రులకు తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. తాను ఎంపీగా హైదరాబాదులో గన్మెన్ లేకుండా తిరుగుతానని, అలాంటప్పుడు సామాన్యులకు రక్షణ లేదని ఎలా అంటారన్నారు.
హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులు భయాందోళనలు పెట్టుకోవద్దన్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యలను తాను జివోఎంకు చెప్పానన్నారు. పద్దెనిమిది పేజీల నివేదికను ఇచ్చినట్లు చెప్పారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు లేని పోని భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టి కాంగ్రెసు నేతలు అభిప్రాయాలు, వైఖరులు భిన్నంగా ఉన్నాయన్నారు. హైకోర్టును ఎలా విభజిస్తారని ప్రశ్నించారు.
అంతకుముందు అఖిల పక్ష భేటీలో భాగంగా కేంద్ర మంత్రుల బృందం(జివోఎం)తో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో జివోఎం సభ్యులు ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, జైరామ్ రమేష్, వీరప్ప మొయిలీలు హాజరయ్యారు.
జివోఎం భేటీకి ఆంటోని తొలిసారి హాజరయ్యారు. టాస్క్ఫోర్స్ చీఫ్ విజయకుమార్ కూడా హాజరయ్యారు. జివోఎం ఒక్కో పార్టీతో ఇరవై నిమిషాల పాటు సమావేశమవుతుంది. ఇందులో భాగంగా తొలుత అసద్తో భేటీ అయింది.
జివోఎంకు టిడిపి నో
జివోఎం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశానికి తమ పార్టీ వెళ్లేది లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు హైదరాబాదులో స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రెండు ప్రాంతాల నుంచి స్టేట్ హోల్డర్స్ను పిలిచి మాట్లాడాలనేదే తమ డిమాండ్ అన్నారు. లేఖ ఎవరికి రాయాలనే అంశంపై సాయంత్రం మరోసారి సమావేశమై అందులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జివోఎం రాష్ట్రమంతా తిరిగి ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలన్నారు.