మోడీతో భేటీ: పవన్కళ్యాణ్ సినిమాలపై అసద్ హెచ్చరిక
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసి మద్దతు తెలపడాన్ని మజ్లిస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. పవన్ సినిమాలు ఎలా ఆడుతాయో చూస్తామంటూ హెచ్చరిస్తోంది.
రెండు రోజుల క్రితం మోడీతో పవన్ భేటీ అయి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. పవన్ సినిమాలు హైదరాబాదులో ఎలా ఆడుతాయో చూస్తామని హెచ్చరించారు.

ప్రస్తుత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో నాడు పార్టీ పెడితే ఏం కాలేదని, ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ పెట్టినంద మాత్రాన ఏమౌతుందన్నారు. అతని సినిమాలు హైదరాబాదులో ఎలా విడుదల చేస్తారో చూస్తామన్నారు. కొన్ని టీవి ఛానళ్లు మోడీకి ప్రచారం కల్పిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మోడీ తుమ్మినా, దగ్గినా.. నీళ్లు తాగినా ఏం చేసినా మీడియా విస్తృతంగా ప్రచారం కల్పిస్తోందన్నారు. కొన్ని టీవీ ఛానళ్లు పని గట్టుకొని మోడీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయని, ఇది చాలా బాధాకరమన్నారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారం కోసం మహబూబ్నగర్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications