బిల్లు పెడితే హైదరాబాద్లో మిలియన్ మార్చ్: అశోక్
విభజన జరగకుండా 2014 దాకా తాము జీవితాలను ఫణంగా పెడుతామని, ఆ తర్వాత బాధ్యత రాజకీయ నాయకులదేనని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలు మంచి అభ్యర్థులను పార్టీలకు అతీతంగా సమర్థించాలని ఆయన సూచించారు. తాము రాజకీయ పదవులను ఆశించడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కడదాకా పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం తప్ప తమకు మరో ఆలోచన లేదని ఆయన చెప్పారు. డబ్బుతో ఓట్లను కొంటామని కొందరు నేతలు చెబుతున్నారని అంటూ ప్రజలను చులకనగా చూసే నాయకులకు బుద్ధి చెప్పాలని సూచించారు. నాయకులకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకపోేత వారి స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తామని అశోక్ బాబు చెప్పారు.
ఓటు నిజాయితీగా వేయాలని, ఎవరికి ఓటు వేయాలో సమయం వచ్చినప్పుడు తాము చెబుతామని అన్నారు. పార్టీని చూసి ఓటేస్తే ఆ తర్వాత పార్టీని మరో పార్టీలో కలిపే అవకాశం ఉందని, వ్యక్తులను చూసి ఓటేయాలని, మీ ప్రాంతంలో మంచి నాయకుడు ఉంటే పార్టీతో సంబంధం లేకుండా సమర్థించాలని ఆయన అన్నారు.
సీమాంధ్ర నాయకులు రెండు నాల్కల ధోరణిని సహించబోమని హెచ్చరించారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశఆరు. వర్షంలో తడిసి, ఎండలో ఎండి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఐదు కోట్ల ప్రజల అభిమానానికి తాము అమ్ముడుపోయామని అన్నారు. శాసనసభలో విభజన తీర్మానాన్ని సీమాంధ్ర శాసనసభ్యులు ఓడించాలని ఆయన డిమాండ్ చేశారు.
సమైక్యాంధ్ర డిమాండ్తో ఈ నెల 23వ తేదీన కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని, 24వ తేదీన భోజన విరామ సమయంలో ప్రదర్శన నిర్వహించాలని ఎపి ఎన్జీవోల సంఘం నిర్ణయించింది. 25వ తేదీన బస్టాండులు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. 27వ తేదీన జాతీయ రహదారులను దిగ్భంధించాలని నిర్ణయించారు.