జగన్ తో పోరాడి గెలిచిన ఒకే ఒక్కడు- సర్కార్ ఎత్తులన్నీ చిత్తు-రాజా మజాకా ?
ఏపీలో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీతో పాటు ఇతర విపక్షాలు టార్గెట్ చేస్తున్నప్పుడు వైఎస్ జగన్ అసహనంగా కనిపించేవారు. విపక్షం చేస్తున్న రాజకీయాలతో పోలిస్తే మంచి రాజకీయాలు చేస్తానని, తనకు ఓటేయాలని పదే పదే ప్రజల్ని అభ్యర్ధించేవారు. కానీ ఓసారి అధికారంలోకి వచ్చాక మాత్రం జగన్ సగటు రాజకీయ నేతగా మారిపోయారు. గతంలో తనను టార్గెట్ చేసిన వ్యక్తుల్ని, పార్టీల్ని దయాదాక్షిణ్యాలు లేకుండా టార్గెట్ చేసేస్తున్నారు. దీంతో ప్రత్యర్ధులు విలవిల్లాడుతున్న పరిస్దితి. అయితే ఇందులో ఒక్కరు మాత్రం జగన్ తో పోరాడి గెలవడం ద్వారా విజేతగా రికార్డు సృష్టించారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది.

జగన్ సర్కార్ టార్గెట్
ఏపీలో గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షంలో ఉన్న వైసీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకునేది. ఎమ్మెల్యేలు, ఎంపీలన్న తేడా లేకుండా అందరినీ టార్గెట్ చేసేది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఇదే పరిస్ధితి. అందిన కాడికి ప్రత్యర్ధుల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అధికారం చేపట్టగానే జరిగిన ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన ఈ టార్గెట్ల పర్వే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యలో చాలా మంది ప్రత్యర్ధులు విలవిల్లాడుతుండగా.. మరికొందరు దారికొచ్చేశారు కూడా. ఇంకొందరు మాత్రం ఇప్పటికీ సై అంటే సై అంటున్నారు.

మాన్సాస్ పై వైసీపీ సర్కార్ కన్ను
ప్రత్యర్ధుల్ని ఒక్కొక్కరుగా టార్గెట్ చేస్తూ వస్తున్న వైసీపీ సర్కార్ కన్ను ఇదే క్రమంలో విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టుపై పడింది. తన ప్రత్యర్ధి పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ కూడా అయిన అశోక్ గజపతిరాజును వైసీపీ టార్గెట్ చేసింది. ఇదే క్రమంలో ఆయన్ను పూసపాటి రాజవంశానికి చెందిన మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పదవి నుంచి అర్ధాంతరంగా తప్పించింది. అశోక్ గజపతిరాజు స్ధానంలో ఆయన అన్న కూతురు సంచైత గజపతిరాజును ఛైర్ పర్సన్ గా నియమించింది. అంతేకాదు మాన్సాస్ లో అక్రమాలన్నీ వెలికితీసే పనిలో పడింది. అయితే ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఓ మౌలికమైన విషయాన్ని మాత్రం మర్చిపోయింది.

జగన్ విసిరిన బాణం సంచైత
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తప్పించి ఆయన స్ధానంలో తన అన్న ఆనందగజపతిరాజు కూతురు సంచైత గజపతిరాజును జగన్ సర్కార్ తెరపైకి తెచ్చింది. అర్ధరాత్రి జీవోలతో సంచైతను మాన్సాస్ ట్రస్టుతో పాటు సింహాచలం దేవాలయ ట్రస్టుకూ ఛైర్ పర్సన్ గా చేసేసింది. ఆమె కూడా అంతే హడావిడిగా ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రమాణ స్వీకారం చేసేశారు. దీంతో ఇక మాన్సాస్ లో అశోక్ గజపతిరాజు శకం ముగిసిపోయినట్లేనని అంతా భావించారు. సంచైత కూడా వచ్చీ రాగానే అశోక్ హయాంలో అక్రమాలు వెలికితీస్తానని ప్రకటించడంతో పాటు మాన్సాస్ లో ఎన్నో మార్పులకు తెరదీశారు. గతంలో అశోక్ తీసుకున్న పలు నిర్ణయాల్ని తిరగతోడటం మొదలుపెట్టారు.

హైకోర్టుకెక్కిన అశోక్ గజపతిరాజు
తన వంశానికి చెందిన మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పదవి నుంచి వైసీపీ సర్కార్ తప్పించడాన్ని జీర్ణించుకోలేకపోయిన అశోక్ గజపతిరాజు న్యాయపోరాటం ప్రారంభించారు. హైకోర్టులో వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేయడంతో పాటు తాను ఛైర్మన్ గా కొనసాగడానికి ఉన్న అర్హతలన్నీ కోర్టుకు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు... వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అశోక్ ను తిరిగి మాన్సాస్ ఛైర్మన్ గా నియమించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో జగన్ సర్కార్ కు తొలిదెబ్బ తగిలింది.

మరింత రెచ్చిపోయిన వైసీపీ సర్కార్
అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా తిరిగి నియమిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు వైసీపీ సర్కార్ కు అస్సలు మింగుడుపడలేదు. దీంతో ఈ తీర్పును ఎలా సవాల్ చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడింది. అదే సమయంలో మాన్సాస్ లో అక్రమాల్ని తెరపైకి తెచ్చింది. కొన్నేళ్లుగా అక్కడ ఫోరెన్సిక్ ఆడిట్ జరగలేదనే విషయాన్ని తీసుకుని అశోక్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో మహిళా కమిషన్ సాయంతో మాన్సాస్ లో మగ వారసుడే ఛైర్మన్ ను చేయడం లింగ వివక్ష కిందకు వస్తుందని వాదించడం మొదలుపెట్టింది. చివరికి ఈ ఎత్తులన్నీ ఫలించకపోవడంతో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేయడంతో పాటు సంచైతతో కూడా పిటిషన్లు వేయించింది.

మళ్లీ గెలిచిన అశోక్
అశోక్ గజపతిరాజును తిరిగి మాన్సాస్ ఛైర్మన్ గా నియమిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన ప్రభుత్వానికి అక్కడా ఊరట దక్కలేదు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తప్పుపట్టడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వంతో పాటు సంచైత గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. దీంతో అశోక్ గజపతిరాజు మాన్సాస్ ఛైర్మన్ గా కొనసాగడానికి మరోసారి రూట్ క్లియర్ అయింది. దీంతో వైసీపీ సర్కార్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
Recommended Video

జగన్ తో పోరాడి గెలిచిన ఒకే ఒక్కడు
వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక పలువురు విపక్ష పార్టీ నేతల్ని, ప్రజాప్రతినిధుల్ని టార్గెట్ చేసింది. అలాగే ఎస్ఈసీ హోదాలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను, ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఉన్న ఉదయ్ భాస్కర్ ను టార్గెట్ చేసింది. వీరిని సాగనంపేందుకు చేయని ప్రయత్నాలు లేవు. దీంతో వీరు అధికార పార్టీని, ప్రభుత్వాన్ని ఎదిరించలేక ఇప్పటికీ మౌనంగా తమ పని తాము చేసుకుపోతున్నారు. కానీ అశోక్ గజపతిరాజు మాత్రం వైసీపీ సర్కార్ తో , ముఖ్యంగా సీఎం జగన్ తో పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిబంధనలు తనకు అనుకూలంగా ఉండటంతో జగన్ సర్కార్ పై సమరశంఖం పూరించారు. తన వంశానికి చెందిన మాన్సాస్ ట్రస్టు విషయంలో ఎట్టి పరిస్ధితుల్లోనూ వెనక్కి తగ్గరాదని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే తన రాజకీయ బుర్ర వాడారు. జగన్ సర్కార్ హైకోర్టులో ఎన్ని పిటిషన్లు వేసినా అందులో ఎక్కడా వెనక్కి తగ్గలేదు చివరికి తాను అనుకన్న ఫలితాన్ని సాధించారు. అంతేకాదు జగన్ సర్కార్ తనను టార్గెట్ చేస్తోందన్న అంశాన్ని బలంగా ప్రజల్లోకి వెళ్లేలా చేయగలిగారు. దీంతో మాన్సాస్ వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్టపాలైంది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications