బిల్లుపై చర్చ జరగాలి, జగన్ది విభజన వాదమే: జెపి
హైదరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యమంటూనే విభజనను కోరుకుంటోందని లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆరోపించారు. ఆయన సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. జగన్మోహర్ రెడ్డి గతంలో ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని కోరారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రాంతంలోనే పట్టు ఉంది కాబట్టి సమైక్యమని అంటోందని విమర్శించారు.
అసెంబ్లీలో జనవరి 23 వరకే తెలంగాణ ముసాయిదా బిల్లు ఉంటుందని, ఆ లోగా బిల్లుపై చర్చ జరిపి కేంద్రానికి సభ అభిప్రాయాన్ని తెలపాలని అన్నారు. 23 వరకు బిల్లుపై చర్చ జరగకపోయినట్లయితే అసెంబ్లీకి బిల్లుపై ఎలాంటి అభిప్రాయం లేదని భావించి పార్లమెంటు తన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు సభలో బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. అసెంబ్లీకి రాజ్యాంగ బద్దంగానే ముసాయిదా బిల్లు వచ్చిందని ఆయన తెలిపారు.
తెలంగాణ ప్రాంతం వారు తమ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు లేకే నష్టపోయామని అంటున్నారని, తమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ రాయలసీమ ప్రజలు వెనుకబాటుకు గురయ్యారని జెపి తెలిపారు. కోస్తాంధ్ర ప్రజలు తమ ఆత్మగౌరవం దెబ్బతిందని వారు భావోద్వేగానికి గురవుతున్నారని చెప్పారు. సభలో నిర్ధ్వందంగా చర్చ జరగాలని ఆయన అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై మూడు ప్రాంతాల సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు.
విభజనతో నష్టం జరుగుతోందని కొందరు సభ్యులు అంటున్నారని, అయితే వారు నష్టాలపై సభలో వివరించాలని అన్నారు. బిల్లుపై ఉన్న సందేహాలను కూడా తెలియజేయాలని, మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలను సభ్యులు సభ ముందుకు తీసుకురావాలని అన్నారు. సభను అడ్డుకుంటున్న సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ప్రజల మనోభావాలు తెలియజేసేందుకు మరో వేదికేమైనా ఉందా అని ఆయన ఈ సందర్భంగా సభ్యులను ప్రశ్నించారు.
బిల్లును స్వాగతిస్తున్నారా? లేక తిరస్కరిస్తున్నారా అనే విషయాన్ని సభ్యులు తెలియజేయాలన్నారు. బిల్లులో ఏమైనా సవరణలు అవసరమా అనేదానిపై కూడా చర్చ జరగాలని ఆయన అన్నారు. సామరస్య వాతావరణంలో పరిష్కారం చూపాల్సిన బాధ్యత సభకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జనవరి 11న ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ను కలుస్తామని ఆయన చెప్పారు.